ఎల్లారెడ్డి/ లింగంపేట/ మద్నూర్/ నిజాంసాగర్/ బాన్సువాడ టౌన్, జనవరి 10: క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిలోని గురుకుల పాఠశాల ఆవరణలో యువజన క్రీడలను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. యువకులు, విద్యార్థులు ప్రతి రోజూ క్రీడలు ఆడాలని సూచించారు. వివేకానంద జయంతి సందర్భంగా యువజన వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్ సర్వీస్ చేసి పోటీలను ప్రారంభించారు. విద్యార్థులతో కబడ్డీ ఆడారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట ఎస్సైలు గణేశ్, ఆంజేయులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
లింగంపేటలోని కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థినులకు కబడ్డీ పోటీలు నిర్వహించినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. 12వ తేదీన వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కబడ్డీ పోటీ నిర్వహించామని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్వో వాసంతి, ఏఎస్సై ప్రకాశ్తో పాటు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మద్నూర్లోని బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన పోటీలను ఎస్సై శివకుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ ఎగురవేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీబాయి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్ష, కార్యదర్శులు దరాస్ సురేశ్, గఫార్. ప్రిన్సిపాల్ సురేందర్, మండల పశువైధ్యాధికారి విజయ్కుమార్, పంచాయతీ కార్యదర్శి సందీప్కుమార్, ఉపసర్పంచ్ విఠల్, నాయకులు బస్వంత్రావు, లక్ష్మణ్, శివ, హన్మాండ్లు, సుభాష్, గోపి, హన్మంత్, సంతోష్ తదితరులు పాల్గొనారు.
నిజాంసాగర్ పోలీస్స్టేషన్ ఆవరణలో నిజాంసాగర్, ఎల్లారెడ్డి మండలాలకు చెందిన పలు గ్రామాల క్రీడాకారులకు వాలీబాల్ పోటీలను నిర్వహించారు. బాన్సువాడ రూరల్ సీఐ మురళి, నిజాంసాగర్ ఎస్సై రాజు ప్రారంభించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అన్నసాగర్ సర్పంచ్ నాగరాజు, ఉపాధ్యాయులు వెంకటేశం, జోసఫ్, పీఈటీలు వెంకటి, బాబూరావ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో క్రీడా పోటీలను ఎంపీపీ ప్రతాప్రెడ్డి ప్రారంభించారు. యువకులు పోటీల్లో పాల్గొని ప్రతిభను చూపాలని ఆయన సూచించారు. పోటీలతో మానసికోల్లాసంతో పాటు శారీరక ద్రుఢత్వం సాధ్యమని అన్నారు.
రేపు నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలు..
బాన్సువాడ పోలీసు శాఖ, కబడ్డీ అసోసియేషన్ సంయుక్తంగా పోటీలను నిర్వహిస్తున్నట్లు బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్రెడ్డి తెలిపారు. బాన్సువాడలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాన్సువాడలోని ఫ్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 15 మంది క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. వారు వచ్చేనెలలో బాన్సువాడ ప్రో కబడ్డీ లీగ్లో పాల్గొంటారని తెలిపారు. పోటీల్లో విజేత జట్టుకు రూ.ఐదు వేలు, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.రెండు వేల ఐదు వందల నగదు అందజేస్తామన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కబడ్డీ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోం చేసుకోవాలని సూచించారు.