సహాయక చర్యలపై సమీక్షలో ఐజీ కమలాసన్రెడ్డి
నిజామాబాద్ క్రైం, జూలై 11: వర్షాలతో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఐజీ (నిజామాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) బి.వి.కమలాసన్ రెడ్డి సూచించారు. జిల్లాలో నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన సహాయక చర్యలపై కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజుతో సోమవారం సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు జలమయంకావడంతో అక్కడి నుంచి ప్రజలను కాపాడడానికి అవసరమైన చర్యలపై చర్చించారు.రోడ్డు మరమ్మతులతోపాటు ప్రమాదకరంగా ఉన్న భవనాల నుంచి ప్రజలను బయటికి తీసుకురావడం, వర్షపునీరు నిలిచిన ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలుగుకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల భద్రత కోసం 24 గంటల పాటు విధులు నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్, కొత్తగా నిర్మిస్తున్న నూతన భవనం, ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయం, పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని అన్ని విభాగాలు,కమాండ్ కంట్రోల్ రూమ్ను ఐజీ కమల్హాసన్ రెడ్డి పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్బాబు,అదనపు డీసీపీ గిరిరాజ్, నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్, ఏఆర్ ఏసీపీ సంతోష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.