బాన్సువాడ, డిసెంబర్ 4 : బాన్సువాడ నియోజక వ ర్గం అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే భిన్నంగా ఉం టుంది, నియోజక వర్గంలో గిరిజనులు, మైనార్టీలు, కమ్మ సామాజిక వర్గం, బీసీలు, ఆర్యవైశ్యులు. లింగాయతులు, రెడ్డి, బీసీ, గొల్లకుర్మ, ముదిరాజ్, పద్మశాలి, మున్నూరు కాపు, బలిజ తదితర అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. ఇందులో ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించే సామాజిక వర్గాలతో బాన్సువాడ నియోజకవర్గంలో బరిలో నిలిచే వారి భవితవ్యం తే లుతుంది. కాగా అన్ని సామాజిక వర్గాల వారు పోచారం శ్రీనివాస రెడ్డి చేసిన అభివృద్ధికే పట్టం కట్టారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం..
45 ఏండ్లుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ కురువృద్ధుడు పోచారం 1994 నుంచి తన స్వీయ శక్తితో ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 45 ఏండ్లుగా ప్రజలకు విశ్వాస పాత్రుడైన పోచారం 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సమైక్య రాష్ట్రంలో గృహ నిర్మాణశాఖ, పంచాయతీ రాజ్ శాఖ, గనులు భూగర్భ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈ ప్రాంత ప్రజలు, యువత అభిప్రాయం మేరకు ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టారు. అనంతరం తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు, టీఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా సింగూర్ జలాల కోసం ఉద్యమించారు. అనంతరం 2011లో టీఆర్ఎస్ పార్టీ తరపున ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రైతుబంధు పథకం రూపొందించడంలో తనదైన పాత్ర పోషించి, కేసీఆర్ చేత లక్షీపుత్రుడిగా పేరుతెచ్చుకున్నారు. 2018 ఎన్నికల్లో బాన్సువాడ నియోజక వర్గం ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభ స్పీకర్గా పని చేశారు. ఆది నుంచి పోచారం పేదలు, రైతుల పక్షపాతిగా నియోజక వర్గ ప్రజల గుండెల్లో నిలిచారు. ఈ సారి ఎన్నికల్లో కూడా పోటీ చేసిన పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రజలు మరోసారి ఆశీర్వదించారు. బాన్సువాడ నియోజక వర్గంలో చేసిన అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు. 2018లో 18 వేలకుపై చిలుకు మెజారిటీ వచ్చింది. ఈ సారి స్పీకర్ హోదాలో పోటీ చేసిన పోచారం ఆ మెజారిటీని దాటిపోయారు. 23,464 ఓట్ల మెజారిటీ పొంది చరిత్ర సృష్టించారు.
స్పీకర్ గా పని చేసి గెలిచిన మొదటి నాయకుడు పోచారం
సమైక్య రాష్ట్రంలో జరిగిన అ సెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా పని చేసిన వారు ఎవరూ గెలువలేదని చరిత్ర చెబుతున్నది. స్వరాష్ట్రంలో ఈ సారి బాన్సువాడ నుంచి స్పీకర్ హోదాలో పోటీ చేసిన పోచారం ఆ అపోహను పటాపంచలు చేశారు. ప్రజాస్వామ్యం లో నిజాయితీ గల నాయకులు ఉండాలని, ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించే నాయకుడిగా పోచారం స్పీకర్ హోదాలో గెలిచి చరిత్ర కెక్కారు.
అన్ని మండలాల్లోనూ ఆధిక్యతే..
బాన్సువాడ నియోజక వర్గంలో 1,95,101 ఓట్లు ఉండగా ఇందులో 1,58,663 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ ఆభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గంలోని బాన్సువాడ, కోటగిరి, పొతంగల్, రుద్రూర్ , వర్ని, కోటగిరి, చందూర్, మోస్రా, నస్రుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ ఇలా అన్ని మండలాల్లో అన్ని రౌండ్లలో లీడింగ్ రావడం విశే షం. ఇదంతా పోచారం నిజాయితీ, నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించడంతోనే సాధ్యమైందని ప్రజలు చెబుతున్నారు.