నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడానికే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 1472 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.13.83 కోట్ల డబుల్ బెడ్ రూం ఇండ్ల బిల్లులను స్పీకర్ బుధవారం బాన్సువాడ పట్టణంలో పంపిణీ చేశారు.
-బాన్సువాడ టౌన్, జూలై 26
బాన్సువాడ టౌన్, జూలై 26 : డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారుల్లో ఆనందం రెట్టింపయ్యింది. ఇండ్లకు సంబంధించిన బిల్లులు చేతికి అందడంతో సంతోషంలో మునిగితేలారు. ఇందుకు బాన్సువాడలోని ఎస్ఎంబీ ఫంక్షన్హాల్ వేదికయ్యింది. పట్టణంతోపాటు బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన 1472 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 13.83 కోట్ల బిల్లులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు రూ. 2.76కోట్లు, బాన్సువాడ మండలం రూ. 4.89కోట్లు, నస్రుల్లాబాద్ మండలం రూ. 3.21కోట్లు, బీర్కూర్ మండలానికి రూ. 2.97 కోట్ల
ఈ సందర్భంగా సభాపతి మాట్లాడతూ.. ప్రతిని నిరుపేద కుటుంబం సొంతిటి కలను నెరవేర్చేందుకే సీఎం కేసీఆర్.. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇండ్ల సముదాయాల వద్ద మౌలిక వసతులను కల్పించేందుకు సుమారు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. హడ్కో సంస్థ నుంచి సీఎం కేసీఆర్ రుణం తెచ్చి లబ్ధిదారులకు బిల్లులను అందిస్తున్నారని చెప్పారు.
అత్యధిక డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంతో తనను పోచారం శ్రీనివాసరెడ్డికి బదులుగా డబుల్ బెడ్రూం శ్రీనివాస్రెడ్డి అని పిలుస్తున్నారని స్పీకర్ చమత్కరించారు. ముఖ్యమంత్రి సహకారంతోనే బాన్సువాడ నియోజకవర్గానికి 11వేల ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో 9వేల నివాసాలు పూర్తిగాకా, లబ్ధిదారులు గృహప్రవేశాలు కూడా చేసుకున్నారని వివరించారు. మరో రెండువేల ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున ఇండ్లు నిర్మిస్తున్నది కేవలం తమ నియోజకవర్గంలోనే అని అన్నారు. మొత్తం రూ. 400 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.350 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు.
మానవ జన్మకు ఎంత సంపాదించాం అనేదానికన్నా, ఎంత సేవ చేశామనేదే తరతరాలకు గుర్తుంటుందని స్పీకర్ అన్నారు. ఇంకా ఇండ్లు లేనివారికి ఇక మీదట మూడు లక్షల రూపాయల గృహలక్ష్మి పథకం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా నియోజకవర్గానికి మూడువేల ఇండ్లు మంజురయ్యాయని, విడుతల వారీగా వాటిని అందజేస్తామన్నారు. ఈ పథకంలో కాంట్రాక్టర్లు, జీఎస్టీ లాంటివి ఉండవని, నేరుగా బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమచేస్తామని వివరించారు. అర్హులు స్థానిక తహసీల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే విచారణ చేపట్టి మంజూరు చేస్తామన్నారు. అనంతరం బాన్సువాడ, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన పలువురికి మంజూరైన సీఎంఆర్ చెక్కులను స్పీకర్ పోచారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో భుజంగరావు, బల్దియా చైర్మన్ గంగాధర్, డీసీసీబీ డైరెక్టర్ భూషణ్రెడ్డి, సర్పంచుల ఫోరం బాన్సువాడ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, బుడ్మి సొసైటీ చైర్మన్ గంగారాం, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కనీసం నీడలేని మేము.. సొంతింట్ల ప్రశాంతంగా ఉండాలనుకున్నం. మా సొంత పైసలతోని ఇల్లు కట్టకపోతుంటిమి. సర్కారు సాయంతోనే మా కల నెరవేరింది. ఇల్లు మంజూరు చేసిన స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
-ప్రమీల, హన్మాజీపేట్, బాన్సువాడ మండలం