బాన్సువాడ, మే 4: అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆందుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజవరకూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. గురువారం ఆ యన దేశరాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
అనంతరం తెలంగాణ భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యం తరలింపుపై ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులతో మాట్లాడారు. సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంటాలు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సొసైటీ సిబ్బందితో ఆరా తీశారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, త్వరగా కాంటాలు ఏర్పాటు చేసి రైస్ మిల్లులకు తరలించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని భరోసా కల్పించారు.
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ ఇందేవార్ పాండేతో భేటి
ఢిల్లీలోని శాస్త్రి భవన్లో కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ ఇందేవార్ పాండేను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం కలిశారు. బాన్సువాడ నియోజక వర్గానికి 43 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు పాండే సానుకూలంగా స్పందించారు. స్పీకర్తోపాటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఉన్నారు.