సదాశివనగర్, జూన్ 18: సీఎం కేసీఆర్ అపర భగీరథుడని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సదాశివనగర్ మండలంలోని మల్లన్నగుట్ట వద్ద ఆదివారం మంచినీళ్ల పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్తోపాటు ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మనరాష్ట్రంలోనే ప్రతి ఇంటికీ ఫిల్టర్ చేసిన తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.
సురక్షితమైన నీటిని తాగడంతో వ్యాధులు రావడం లేదన్నారు. సమైక్యపాలనలో తాము ఏ గ్రామాలకు వెళ్లినా మహిళలు రోడ్డుపై బిందెలతో నిరసన తెలిపేవారని గుర్తుచేశారు. నీటి సమస్యను పరిష్కరించాలని కోరేవారని తెలిపారు. ఎల్లారెడ్డి నియెజక వర్గంలోని తాడ్వాయి, గాంధారి, లింగంపేట్ మండలాలకు చెందిన ప్రజలు తాగునీరు కోసం వ్యవసాయ బావుల వద్దకు కిలోమీటరు దూరం నడిచివెళ్లే వారన్నారు. స్వరాష్ట్రంలో పరిస్థితి మారిందన్నారు. నీటి కోసం మహిళలు ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారన్నారు. ఈ పథకం ద్వారా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ప్రతిపక్ష నాయకులకు కనిపించడంలేదన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాగునీరు వృథా చేయొద్దు..: కలెక్టర్
తాగు నీటిని వృథా చేయవద్దని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు.జిల్లాలోని అన్ని గ్రామాల్లో నీరు పుష్కలంగా లభిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఈఈ లక్ష్మీనారాయణ, సిబ్బందిని అభినందించారు. సభ అనంతరం వారు మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వీక్షించారు. శ్రీరాంసాగర్ నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా అధికారులు వివరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఈ రమేశ్, ఏఈ శ్రీధర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్, సదాశివనగర్, రాజంపేట్, రామారెడ్డి ఎంపీపీలు అనసూయ, స్వరూపా కృష్ణమూర్తి, నారెడ్డి దశరథ్ రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోహినొద్దీన్, మర్కల్, సదాశివనగర్ సర్పంచులు సంగారెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, గైని శ్రీనివాస్ గౌడ్, గాంధారి, రాజంపేట్ జడ్పీటీసీలు శంకర్ నాయక్, కొండ హన్మాండ్లు, రైతు బంధు సమితి మండల కన్వీనర్లు భూంరెడ్డి, నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పుల్గం సాయిరెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్ విండో చైర్మన్లు కమలాకర్ రావు, కపిల్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.