నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్6: జిల్లాలో హనుమాన్ జయంతిని ప్రజలు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ, గ్రామ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. యువత పెద్ద ఎత్తున రోడ్లపై ర్యాలీలు చేపట్టారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రల్లో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. జై బోలో హనుమాన్ కీ జై.. జై హనుమాన్.. జైజై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు. యువతీ, యువకులు డీజేలు పెట్టి డ్యాన్స్లు చేశారు.
వేల్పూర్ మండల కేంద్రంలో జంబి హనుమాన్ ఆలయంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నవీపేట మండలం తుంగినీ ఆలయాన్ని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, హిందూ వాహిని, ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇందూరు నగరంలోని కంఠేశ్వర్ నుంచి వీర హనుమాన్ విజయయాత్ర ప్రారంభమైంది. హనుమాన్ దీక్ష గురుస్వామి నాగభూషణం కొబ్బరి కాయ కొట్టి జెండా ఊపారు. యాత్రలో హనుమాన్ స్వామి ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పూజలు చేశారు.
ఈ యాత్రతో ఆధ్యాత్మిక వైభవం సంతరించుకుందని అన్నారు. యాత్రలో పాల్గొనే భక్తులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద తాగు నీరు, పండ్లు, అల్పాహారాన్ని అందించారు. కంఠేశ్వర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర హమాల్వాడీ, శివాజీచౌక్, పాతగంజ్, దేవీరోడ్, గాంధీచౌక్, నెహ్రూపార్కు, పెద్దబజార్, గోల్హనుమాన్ వరకు సాగింది. హనుమాన్ జయంతి సందర్భంగా గాంధీచౌక్లో భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు ఆధ్వర్యంలో భక్తులకు ముస్లిములు, నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఇన్చర్జి సీపీ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిద్దిపేట్ పోలీసులు శోభాయాత్ర సందర్భంగా బందోబస్తు నిర్వహించారు.
తెలంగాణ యూనివర్సిటీలోని హనుమాన్ ఆలయంలో వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ ప్రత్యేక పూజలు చేశారు. డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్ హనుమాన్ ఆలయంలో కమాండెంట్ ఎన్వీ సత్యశ్రీనివాస్-పర్వత వర్ధిని దంపతులు ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమం చేపట్టారు. కోటగిరి మండలంలోని హనుమాన్ మందిరంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి పూజలు చేపట్టారు. ఆర్మూర్, బోధన్, భీమ్గల్ పట్టణాలతోపాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో భక్తులు హనుమాన్ శోభాయ్రాత నిర్వహించారు.