ఖలీల్వాడి, ఆగస్టు 18: ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణలో చీకటి బతుకులే అన్న విమర్శకులే నేడు షాక్ తింటున్నారు. విద్యుత్ సమస్యలపై సీఎం కేసీఆర్ అంతగా శ్రద్ధ వహించి రెండేండ్లలోనే అన్ని సమస్యలనూ పరిష్కరించారు. నిరంతరాయంగా నాణ్యమైన కరెంటును అందించి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారు. వ్యవసాయం, పరిశ్రమలు, నివాసాలకు 24గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నారు. ప్రతినెలా కరెంటు బిల్లును చెల్లించాలంటే విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగి గంటల కొద్దీ లైన్లో నిలబడాల్సి వచ్చేది. కొంతమందికి అధికంగా బిల్లులు, మరి కొందరి చేతికి బిల్లులు అందక సరైన సమయంలో చెల్లించేవారు కాదు. దీంతో విద్యుత్శాఖ సిబ్బంది కరెంటు కట్చేయడంతో ఒత్తిడికి గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గ్రామాల్లో లెన్మన్లు, పట్టణాల్లో విద్యుత్శాఖ పాయింట్ల వద్ద బిల్లులు చెల్లిస్తే కొందరు సిబ్బంది సొంత అవసరాలకు వాడుకోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన ఘటనలు కూడా ఉన్నాయి. కరెంటు బిల్లుల చెల్లింపులో ఎలాంటి సమస్య వచ్చినా చివరికి వినియోగదారుడే ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించే అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు వినియోగదారులను ప్రోత్సహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికారులు ఇప్పటికే ఊరూరా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఫోన్పే, గూగుల్పే, బిల్డెస్క్ తదితర యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఇంటి నుంచే విద్యుత్ బిల్లులను సులువుగా చెల్లించవచ్చు. వినియోగదారులు తమ బిల్లులను వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా క్షణాల్లో కట్టవచ్చు. ఆన్లైన్ ద్వారా బిల్లులను చెల్లించేందుకు టీఎస్ఎన్పీడీసీఎల్ వెబ్సైట్లో పేబిల్స్ ఆన్లైన్ లింక్, విద్యుత్ బిల్ డెస్క్, పేటీఎం, టీ వ్యాలెట్, ఫోన్పే యాప్ను వినియోగించుకోచ్చు. యూనిక్ సర్వీస్ నంబర్, జిల్లా, ఈఆర్వో వివరాలను నమోదు చేసి డెబిట్, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్తో డబ్బులను చెల్లించవచ్చు.
నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయానికి సంబంధించిన కనెక్షన్లు 1.65 లక్షలు ఉండగా.. దాదాపు రూ. 10.39 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. గృహ, కమర్షియల్కు సంబంధించి 3.84 లక్షల కనెక్షన్లు ఉండగా, రూ. 49.92 కోట్లు చెల్లిస్తున్నారు. ఇందులో 80శాతం వినియోగదారులు మాత్రమే బిల్లులు సజావుగా చెల్లిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వ్యవసాయానికి సంబంధించిన 92 వేల కనెక్షన్లు ఉండగా.. రూ. 8.68 కోట్లు చెల్లించాల్సి ఉంది. గృహ, కమర్షియల్కు సంబంధించి 2.45 లక్షల కనెక్షన్లకు గాను రూ. 17.05 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 70-80శాతం మాత్రమే వినియోగదారులు సక్రమంగా బిల్లు కడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 20శాతం వరకు మొండి బకాయిలు ఉన్నాయి. వీరు కూడా బిల్ డెస్క్ ద్వారా కరెంటు బిల్లులను చెల్లించే అవకాశాన్ని విద్యుత్శాఖ కల్పించింది.
విద్యుత్ శాఖ అధికారులు ఆన్లైన్లో కరెంటు బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు. అప్పటి నుంచి నేను ప్రతినెలా ఫోన్పే, పేటీఎం యాప్ల ద్వారా ఇంటి నుంచే కరెంటు బిల్లును చెల్లిస్తున్నా. కరెంటు ఆఫీసులకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయింది. చాలా సమయం ఆదా అవుతున్నది.
-పోగు అనిల్, కిరణా షాపు యాజమాని
గతంలో కరెంటు బిల్లు కట్టేందుకు కరెంటు ఆఫీసులకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ పెద్దపెద్ద క్యూలు ఉండేవి. సగం రోజు అక్కడే గడిచిపోయేది. ఆన్లైన్ యాప్లు వచ్చిన తర్వాత కరెంటు బిల్లు కట్టేందుకు కొంత సులభంగా మారింది. ఇప్పుడు ఎన్పీడీసీఎల్ బిల్డెస్క్ ద్వారా బిల్లును చెల్లిస్తున్నా. ఇందులో చాలా వివరాలు ఉన్నాయి.
-నాగభూషణం, ఎలక్ట్రానిక్ స్టోర్
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. గతంలో ఏఈఆర్వో కార్యాలయాల్లో బిల్లులు చెల్లించే విధానం ఉండేది. ఇప్పుడు కరెంటు బిల్లులను ఆన్లైన్లో చెల్లించే అవకాశం కల్పించాం. ఆన్లైన్ ద్వారా బిల్లు కడితే అవకతవకలకు చోటుండదు. ఎలాంటి సమస్యలు తలెత్తవు. వినియోగదారుల సమయం కూడా ఆదా అవుతుంది.
-రవీందర్, ఎస్ఈ, నిజామాబాద్