ఆపత్కాలంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన రోగులకు వరంగా మారుతున్నది. ఓపీ సేవలు రోజుకు 1500 దాటుతుండడం.. నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయనడానికి నిదర్శంగా నిలుస్తున్నది. అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, డయాగ్నోస్టిక్ హబ్ ఉండడంతో రోగులు దవాఖానకు పోటెత్తుతున్నారు. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. వీరంతా జీజీహెచ్కు తరలివస్తుండడంతో అందుకు తగినట్లుగా దవాఖాన అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేస్తూ ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం దవాఖానలో ఇన్పేషెంట్ విభాగంలో అన్ని పడకలు నిండిపోవడం గమనార్హం.
-ఖలీల్వాడి, ఏప్రిల్ 30
ఖలీల్వాడి, ఏప్రిల్ 30 : మెరుగైన వైద్య సేవలు, అరుదైన శస్త్ర చికిత్సలతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించింది. వైద్యులు ప్రత్యేక శ్రద్ధపెట్టి రోగులకు మెరుగైన సేవలు అందిస్తుండడంతో జీజీహెచ్కు ఆదరణ పెరిగింది. ఓపీ, ఐపీ సంఖ్య భారీగా నమోదవుతున్నది.
ప్రైవేటు దవాఖానల్లో వైద్యం చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అవుట్ పేషెంట్లకు కనీసం రూ. 400 ఫీజును తీసుకుంటున్నారు. ఆదివారం, అత్యవసర సమయాల్లో మరో వంద నుంచి 200 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో చాలామంది సర్కారు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. అధునాతన వైద్య పరికాలతో కార్పొరేట్ స్థాయిని మించి సేవలు అందిస్తున్న నిజామాబాద్ జీజీహెచ్.. వైద్యం కోసం వచ్చేవారితో కిటకిటలాడుతున్నది. అవుట్ పేషెంట్ల సంఖ్య ప్రతిరోజూ 1500కు పైగా నమోదవుతున్నది. ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. నయా పైసా తీసుకోకుండా ఉచితంగా చికిత్స చేయడంతోపాటు మందులూ అందిస్తున్నారు. రూ. 6లక్షల వరకు ఖర్చయ్యే చికిత్సలు కూడా ఉచితంగా చేయడంతో జీజీహెచ్లో మొత్తం 1350 బెడ్లు రోగులతో నిండిపోయాయి. జిల్లాలో వారం రోజులుగా వాతావరణంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ఎండలతోపాటు అకాల వర్షాలూ కురుస్తున్నాయి. వైరల్ జ్వరాలు, ఇన్ఫెక్షన్లు పెరిగాయి. దీంతో ప్రజలు దవాఖానలకు క్యూ కడుతున్నారు. జీజీహెచ్లో రక్తపరీక్షలు, వైద్యంతోపాటు మందులు కూడా ఉచితంగా అందిస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక పర్యవేక్షణ..
నాణ్యమైన సేవలతో రాష్ట్రంలోనే పేరుగాంచిన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన నిరుపేదలకు వరంగా మారింది. రోగులకు అన్ని వసతులు కల్పించడంతోపాటు విజయవంతంగా ఆపరేషన్లు చేస్తుండడంతో జీజీహెచ్కు ఎన్నో ఉత్తమ పురస్కారాలు దక్కాయి. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ప్రతి వార్డునూ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రోగులు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి వైద్య సేవలపై సూచనలు చేస్తున్నారు. పక్కా ప్రణాళికతో క్రిటికల్ ఆపరేషన్లను సైతం విజయవంతం చేస్తున్నారు. హెచ్వోడీలు, సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో డ్యూటీ డాక్టర్లు, పీజీలు రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. డయాగ్నోస్టిక్ హబ్లో ప్రతిరోజూ 1500లకు పైగా రక్త పరీక్షలు చేస్తున్నారు.
విజయవంతంగా శస్త్రచికిత్సలు..
ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. జీజీహెచ్లో మెరుగైన వసతులు కల్పించింది. అధునాతన వైద్య పరికరాలను సమకూర్చడంతోపాటు సరిపడా వైద్య నిపుణులు, సిబ్బందిని నియమించింది. దీంతో అన్ని రకాల ఆపరేషన్లను విజయవంతంగా చేస్తున్నారు. ప్రైవేటు దవాఖానలకు వెళ్లిన ఎంతోమంది రోగులు ఆపరేషన్ల కోసం తిరిగి జీజీహెచ్ను ఆశ్రయించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల సూచన మేరకు వైద్యారోగ్య సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పించడంతో దవాఖానలో రికార్డు స్థాయిలో ప్రసవాలు నమోదవుతున్నాయి. బాలింతలు డిశ్చార్జి అయ్యేటప్పుడు కేసీఆర్ కిట్ అందజేసి క్షేమంగా ఇంటికి పంపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొందరు ప్రభుత్వాన్ని, దవాఖానను అభాసుపాలు చేయాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్నచిన్న సమస్యలను అడ్డం పెట్టుకొని బదనాం చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సౌకర్యాలు, మందుల కొరత లేదు..
ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నది. పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. జీజీహెచ్లో అధునాతన వైద్య పరికాలు ఉన్నాయి. మందుల కొరత లేదు. ఖరీదైన ఎన్నో శస్త్ర చికిత్సలను ఉచితంగా నిర్వహిస్తున్నాం. త్వరలోనే క్యాథ్ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. ఇక్కడ అందుతున్న సేవలతో ప్రజలకు సర్కారు దవాఖానలపై నమ్మకం పెరిగింది. రోగులకు వందశాతం సేవలందించాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. దవాఖాన అభివృద్ధిపై మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు వెంటనే స్పందిస్తారు.
-ప్రతిమారాజ్, సూపరింటెండెంట్, జీజీహెచ్, నిజామాబాద్