‘ప్రజా పాలన’ పేరు చెప్పి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఒకటే పాట పాడారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ప్రజాస్వామ్యబద్ధ పాలన కొనసాగిస్తామని సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, నాయకులు గొప్పలు చెప్పారు. కానీ అధికారం చేపట్టిన వెంటనే తమ నిజస్వరూపం బయటపెట్టారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహించాల్సింది పోయి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ శక్తులను ఎగదోస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను తక్కువ చేస్తూ తమ పార్టీ నేతలను ప్రోత్సహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్, మూడు చోట్ల బీజేపీ, రెండు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.
అయితే, బీఆర్ఎస్, బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలైన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అధికారులను భయపెట్టి ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నారు. తాము చెప్పినట్లే నడవాలని, తమ సమక్షంలోనే అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారు. కొంత మంది నేతల వ్యవహార శైలి ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ప‘వార్’ పాలిటిక్స్ తారా స్థాయికి చేరాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డిని కాదని, అనధికార వ్యక్తి అధికార దర్పం ప్రదర్శిస్తుండడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వినయ్రెడ్డి అధికార దర్పాన్ని చలాయిస్తుండడం కొత్త వివాదానికి తెర లేపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే పైడి రాకేశ్రెడ్డి ఈ వ్యవహారంపై మండిపడుతూ వస్తున్నారు. ఎమ్మెల్యేకు తెలియకుండానే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు జరిగి పోతున్నాయి. ఆలూర్లో ఇటీవల జరిగిన ప్రారంభోత్సవ విషయంలోనూ ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వలేదు. వినయ్రెడ్డి తీరుపై గతంలోనే రాకేశ్రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. పద్ధతి మార్చుకోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు. ‘బిడ్డా వినయ్ రెడ్డి.. జాగ్రత్త ’ అంటూ హెచ్చరించారు.
కామారెడ్డి నియోజకవర్గంలోనూ ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కాదని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ హవా కొనసాగిస్తుండడం చర్చనీయాంశమైంది. నిజామాబాద్ అర్బన్లో ఓడిపోయిన షబ్బీర్ అలీని ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సలహాదారుగా నియమించింది. అయితే, తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిపై ఆయన ప్రధానంగా ఫోకస్ చేశారు.
కీలకమైన పోస్టులో ఉన్న షబ్బీర్ అలీ.. ప్రభుత్వ దవాఖానలో జరిగిన ప్రారంభోత్సవ విషయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కాదని షబ్బీర్అలీతో ప్రారంభోత్సవం చేయించడంపై కాటిపల్లి బహిరంగంగానే మండిపడ్డారు. కామారెడ్డిని షబ్బీర్ అలీకి రాసిచ్చేశారా? అని అధికారులను నిలదీశారు. ఏ ప్రొటోకాల్ ప్రకారం షబ్బీర్అలీతో ప్రారంభిస్తారని ప్రశ్నించారు. మొత్తానికి నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రేగిన ఆధిపత్య పోరు ఇప్పట్లో చల్లారేలా లేదు.
ఎన్నికల్లో గెలవలేదు.. ఎలాంటి పదవీ లేదు.. అయినా కొందరు ‘రాజ్యమేలుతున్నారు’. ఎలక్షన్లలో ఓడిపోయినా, ప్రజలు ఛీత్కరించినా అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. సర్కారు సహకారంతో ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యేలను డమ్మీలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా నియోజకవర్గాల్లో వివాదాలు తలెత్తుతున్నాయి. ప్రొటోకాల్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఆర్మూర్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొన్నది. నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, బాన్సువాడలోనూ ఇలాగే ఆధిపత్యం ప్రదర్శించేందుకు కొందరు ప్రయత్నిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ తీరుపై జనం మండి పడుతున్నారు.
-నిజామాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మొత్తంగా ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలకు విలువే లేదన్నది తేటతెల్లం అవుతోంది. స్వయంగా సీఎం చెప్పినప్పటికీ ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ కాంగ్రెస్ నేతలు అనధికారిక ఎమ్మెల్యేలుగా చలామణి అయ్యేందుకు ప్రయత్నిస్తుండడం విడ్డూరంగా మారింది. ప్రజాపాలన పేరిట పరిపాలనను మొదలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ సిద్ధాంతాన్ని గాలికొదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజల తీర్పుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పాలకులు ఆదర్శవంతమైన పరిపాలనతో మెప్పు పొందాలి కానీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదాకలిస్తూ ఎమ్మెల్యేలను కాదని రాజ్యమేలడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కళ్ల ముందే ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరిగినా, అధికారులంతా అనధికారిక వ్యక్తులకు ఊడిగం చేస్తున్నా పట్టించుకోవాల్సిన ఉన్నతాధికారులు పెదవి విప్పకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఎమ్మెల్యేను కాదని ఇతర రాజకీయ నాయకుల చెంతకు పరుగులు తీసే అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నది.
ఇక, బాన్సువాడలో ఏనుగు రవీందర్రెడ్డి సైతం అధికారులపై పరోక్షంగా ప్రభావం చూపుతుండడంతో పాటు ప్రత్యక్షంగానూ పలు కార్యక్రమాల్లో పాల్గొనడం వివాదం అవుతోంది. నిజామాబాద్ అర్బన్లో బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గెలువగా, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతల ప్రభావంతో ఎమ్మెల్యేను లెక్కలోకి తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బాల్కొండలోనూ ప్రొటోకాల్ విషయంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సునీల్రెడ్డి అంతా తానే అన్నట్లుగా ప్రవర్తించడం వివాదానికి దారి తీస్తోంది. అధికార కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నేతల హడావుడి చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.