నిజామాబాద్, మార్చి 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రైతుల చేతికి ధాన్యం రాక మొదలైంది. హర్వెస్టర్లతో కోస్తున్న ధాన్యాన్ని వచ్చింది వచ్చినట్లే ప్రైవేటు వర్తకులకు రైతులు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో తేమతోనే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించకపోవడంతో నల్లగొండ, కర్నాటక వ్యాపారులకు అప్పగిస్తున్నారు. మార్చి ప్రారంభం నుంచే వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నిజామాబాద్ జిల్లాలో వాలిపోయారు. కోతలు ప్రారంభమవుతోన్న ఏరియాల్లో తిరుగుతూ రైతులకు ముందస్తుగానే బుకింగ్లు చేసుకుంటున్నారు. పచ్చిమీదనే ధాన్యాన్ని సేకరిస్తున్నప్పటికీ ఆశించినంతగా గిట్టుబాటును అందివ్వడం లేదు. క్వింటా ధాన్యానికి రూ.2100 మాత్రమే ఇస్తుండటంతో కర్షకులకు నష్టం వాటిల్లుతోంది. కోతలకు తగ్గట్లుగానే వరి సేకరణ ప్రారంభించాలని రైతులు వేడుకుంటున్నారు. లేదంటే ప్రైవేటు వర్తకులపై పర్యవేక్షణ కొనసాగించి గిట్టుబాటు ధర దక్కే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. బాన్సువాడ, బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో జోరుగా వరి కోతలు కొనసాగుతున్నాయి.
కామారెడ్డి జిల్లాలో 2లక్షల 57వేల 785 ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో 1లక్షా 315 ఎకరాల్లో సన్న రకం, 1లక్షా 50వేల 470 ఎకరాల్లో దొడ్డు రకం ఉంది. మొత్తం ఈ సీజన్లో 6లక్షల 6వేల 899 మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. దొడ్డు రకం అత్యధికంగా 3లక్షల 76వేల 175 మెట్రిక్ టన్నులు, సన్నాలు 2లక్షల 30వేల 724 మెట్రిక్ టన్నులుగా ఉంది. ప్రైవేటు కొనుగోళ్లు, స్థానిక అవసరాలకు 57,501 మెట్రిక్ టన్నులు వెళ్లగా మిగిలిన 5లక్షల 49వేల 298 మెట్రిక్ టన్నులు సేకరించేందుకు పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. ఇందులో సన్నరకం 2లక్షల 30వేల 724 మెట్రిక్ టన్నులు, 3లక్షల 18వేల 574 దొడ్డు రకం ధాన్యం ఉంది. యాసంగి 2026 సీజన్లో ధాన్యం సేకరించేందుకు మొత్తం 411 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 362 దొడ్డు ధాన్యం సేకరణకు, 49 సన్న రకాలను కొనుగోలు చేసేందుకు నెలకొల్పుతున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 179, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 232 కొనుగోలు కేంద్రాలున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో యాసంగి 2026లో మొత్తం 4లక్షల 27వేల 825 ఎకరాల్లో వరి సాగుకు నోచుకుంది. ఇందులో 59,834 ఎకరాల్లో దొడ్డు రకం ఉండగా 3,67,991 ఎకరాల్లో సన్నరకం సాగైంది. మొత్తం 11లక్షల 91వేల 836 మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో 10,20,691 మెట్రిక్ టన్నులు సన్నరకం, 1,71,145 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్థానిక అవసరాలకు 19,501 మెట్రిక్ టన్నులు, 2.72లక్షలు మెట్రిక్ టన్నులు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయగా మిగిలిన 9లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించేందుకు పౌరసరఫరాల సంస్థ సమాయత్తం అవుతోంది. 7,28,855 మెట్రిక్ టన్నులు సన్నాలు, 1,71,145 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. యాసంగి కొనుగోళ్లకు 669 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఐకేపీ 224, పీఏసీఎస్ 408, డీసీఎంఎస్ 24, కేపీపీఎస్ఎస్ఎస్ 1, ఎఫ్పీవో 4, మెప్మా 8 చొప్పున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. సన్న రకాలకు 500, దొడ్డు రకానికి 169 కేంద్రాలు కేటాయించబోతున్నారు.
ప్రజాపాలనలో రైతుల పట్ల పాలకులకు చిత్తశుద్ధి కరువైంది. యాసంగి కొనుగోళ్లకు సమయం ఆసన్నమైనప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ము గ్గురు ప్రభుత్వ సలహాదారులు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలో నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్నారు. ఇన్ఛార్జీ మంత్రిగా సీతక్క కొనసాగుతున్నారు. పీసీసీ చీఫ్గా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ సైతం ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించలేదు. గతంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగేది. తద్వార లోటుపాట్లపై చర్చించి సమస్యలను పరిష్కరించేది. శాఖల మధ్య సమన్వయానికి చ ర్యలు తీసుకునేది. ఇప్పుడలాంటి ఏర్పాట్లు మచ్చుకూ జరగకపోవడం విడ్డూరంగా మారింది.