రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పల్లెప్రగతి.. గ్రామాల రూపురేఖలను మార్చివేసింది. పల్లెలకు కొత్తసొబగులు తీసుకొచ్చింది. కేసీఆర్ ప్రభుత్వ చొరవతో గ్రామాగ్రామాన సకల వసతులు అందుబాటులోకి వచ్చాయి. పల్లెప్రకృతివనాలు, వైకుంఠధామాలు, అద్దంలా మెరిసే రోడ్లు.. ఇలా అన్ని సౌకర్యాలతో అలరారుతున్నాయి. డిచ్పల్లి మండలంలోని సుద్దులం గ్రామం కూడా ఇదే తరహాలో అభివృద్ధి పథంలో సాగుతున్నది. ఒకప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడిన ఈ ఊరు.. ఇప్పుడు అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 3,200 మంది ఉన్న ఈ పల్లెటూరు అభివృద్ధికి చిరునామాగా మారింది. సుద్దులంలో జరిగిన అభివృద్ధిపై నమస్తే తెలంగాణ ఫీల్డ్ విజిట్..
డిచ్పల్లి , ఆగస్టు 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించడంతో గ్రామాల్లో మౌలిక సౌకర్యాలతోపాటు అభివృద్ధి పనులు చేపట్టారు. పల్లెప్రగతి కార్యక్రమంలో డిచ్పల్లి మండలంలో ని సుద్దులం గ్రామ రూపురేఖలు మారాయి. సీఎం కేసీఆర్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో నిధులు పుష్కలంగా మంజూరుకావడంతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పంచాయతీ పాలకవర్గంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు. దీంతో గ్రామంలో అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయి. గ్రామంలో కొన్నేండ్లుగా వేధిస్తున్న విద్యుత్ సమస్యను దూరం చేశారు. పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయి.
సుద్దులంలో హైమాస్ట్ లైటింగ్ సిస్టం
రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో గ్రామంలోని నాలుగు ప్రధాన కూడళ్ల వద్ద హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామం విద్యుత్ కాంతులతో జిగేల్మంటున్నది. మండలంలో హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేసిన మొదటి గ్రామంగా సుద్దులం నిలువడం విశేషం.
పరిశుభ్రతకు ప్రాధాన్యం
గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. చెత్త ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త కుండీల్లోనే వేసేలా చర్యలు తీసుకున్నారు. రెండు రోజులకోసారి ట్రాక్టర్ ద్వారా తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. తడి,పొడి చెత్తను వేరుచేస్తూ డంపింగ్ యార్డుకు తరలించి ఎరువును తయారు చేయడం గమనార్హం. గ్రామంలోని పలు కూడళ్ల వద్ద చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా మారిన, శిథిలమైన విద్యుత్ స్తంభాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పల్లెప్రగతిలో భాగంగా కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ప్రాణాంతకంగా మారి కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి మధ్యలో స్తంభాలు ఏర్పాటు చేశారు. గ్రామం లో విద్యుత్ సమస్యలేకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపారు. వైకుంఠధామంలో రెండు వైపులా మొక్కలు నాటడంతో పచ్చదనం పరుచుకున్న ది. ప్రాంగణంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం ఆహ్లాదం పంచుతున్నది. వనంలో వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయడంతో యువకులు, మహిళలు, పెద్దలు సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామం లో ఇప్పటి వరకు 90 శాతం మరుగుదొడ్లు నిర్మించుకొన్నారు. పది శాతం పనులు ము గింపు దశలో ఉన్నాయి. గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తున్నది. గ్రామాల కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
చెక్డ్యాం నిర్మాణంతో భూగర్భ జలాల పెంపు
భూగర్భ జలాల పెంపు కోసం గ్రామంలో చెక్డ్యాం నిర్మాణం కోసం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రూ.4.50 లక్షల నిధులు మంజూరుచేశారు. ప్రస్తుతం చెక్డ్యాం నీటితో కళకళలాడుతున్నది. ఎగువప్రాంతం నుంచి వరద రావడంతో చెక్డ్యామ్ పొంగిపొర్లుతూ ప్రవహిస్తున్నది. పెద్దచెరువు తలపిస్తూ నీటి కుండలా దర్శనమిస్తున్నది.
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బాజిరెడ్డి కృషితోనే..
సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. సుద్దులం గ్రామాన్ని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకుతోడు వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, యువకులు గ్రామాభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్నారు. సుద్దులం గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుంచడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం.
– వెంకటేశ్, సర్పంచ్