కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 5 : కాంగ్రెస్ నేతల సిఫారసుతో ఖమ్మం జిల్లాకు చెందిన వారికి కూకట్పల్లి కైత్లాపూర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తే స్థానిక నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కైత్లాపూర్లోని డబుల్ బెరూం ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. నగరంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులైన నిరుపేదలకు డ్రా ద్వారా కేటాయించారని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కైత్లాపూర్లో 144 డబుల్ బెడ్రూంలను నిర్మించగా… ఇటీవల ఫతేనగర్కు చెందిన అమృతతండా వాసులకు కేటాయించారని, వాటిలో మిగిలిన డబుల్ బెడ్రూం ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, అధికారుల సిఫారసుతో ఇతర ప్రాంతాల వారికి, అర్హత లేని వారికి కేటాయిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. దీంతో కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. మరోవైపు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, విష సర్పాలు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయని చెప్పారు. పరిసరాలను శుభ్రం చేసి, ప్రహారి గోడ నిర్మించాలని అధికారులను కోరారు.
కైత్లాపూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం కింద నిర్మించిన షటర్లను అధికారులు రూ.20 లక్షలకు అమ్ముకోవడం దుర్మార్గమన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో షటర్లను అపార్ట్మెంట్ మెయింటనెన్స్కు అప్పగించాలని జీవో కూడా జారీ చేసిందన్నారు. కానీ జీవోకు విరుద్దంగా షటర్లను అమ్ముకున్నారన్నారు. మరోవైపు ఖమ్మంకు చెందిన అర్హత లేనివారికి ఇళ్లు కేటాయించారని, వారు కారులో డబుల్ బెడ్రూం ఇంటికి వచ్చారని, కేటాయించిన ప్లాట్లో రూ.15 లక్షలతో ఇంటీరియల్ ఫర్నిచర్ పనులు చేయిస్తున్న వారు నిరుపేదలు ఎలా అవుతారని ప్రశ్నించారు. కైత్లాపూర్లోని పేదలు 87 మంది డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వారికే మిగిలిన ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్లను పారదర్శకంగా కేటాయించాలని కోరారు. ఎక్కడ స్థలం కనిపించినా అమ్ముకోవడం తప్ప… ఈ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి, నిరుపేదల కనీస అవసరాలు తీర్చాలన్నారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్దీన్, ప్రభాకర్గౌడ్, సంతోష్, కల్యాణ్, కృష్ణ, అశ్విన్ అధికారులు పాల్గొన్నారు.