సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారు. పేదింటి బిడ్డలకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెస్తున్నారు. ‘మన ఊరు-మనబడి’ ద్వారా ప్రభుత్వ బడులు సరికొత్తగా ముస్తాబయ్యాయి. సమస్యలు తీరి సకల వసతులు సమకూరాయి.
శక్కర్నగర్, ఆగస్టు 11: గత పాలకులు సర్కారు విద్యను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోక పేద పిల్లలకు చదువును దూరం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్.. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన బస్తీ- మన బడి’తో పాఠశాలల రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించి అన్ని మౌలిక వసతులను కల్పించారు.
బోధన్ పట్టణంలో విలీనమైన పాండుఫారం శివారులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు గాను మొత్తం 70 మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. బడిని పట్టించునేవారు లేక.. ఆవరణలో చెత్తాచెదారంతో నిండిపోయేది. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో బడికి వచ్చే విద్యార్థులతోపాటు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు సైతం బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించేవారు. కేసీఆర్ సర్కారు చేపట్టిన ‘మన బస్తీ- మన బడి’ పథకం కింద ఈ పాఠశాలను ఎంపిక చేసి రూ.12.5 లక్షలు కేటాయించారు. భవనానికి మరమ్మతులు చేపట్టి సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్యారు. నాడు అధ్వాన స్థితిలో ఉన్న ఈ పాఠశాల.. నేడు అపురూపంగా మారింది. భవనానికి అందమైన రంగులు, ఆవరణతో వివిధ మొక్కలు నాటడంతో నందనవనంలా కనిపిస్తున్నది. విద్యుత్ సౌకర్యం కల్పించి తరగతి గదుల్లో లైట్లు, ఫ్యాన్లను ఏర్పాటుచేసేందుకు రూ.లక్షా 10,719 ఖర్చు చేశారు. మినీ వాటర్ ట్యాంక్, వాష్బేసిన్ల కోసం రూ.లక్షా 51,718 వెచ్చించారు. రూ. రెండు లక్షల 64వేల 224తో ప్రహరీ, రూ. 67,254తో కిచెన్ షెడ్డు, రూ. లక్షా 54వేల 665తో మేజర్, మైనర్ మరమ్మతులు చేశారు. రూ. 2లక్షల 66వేల 633తో టాయిలెట్లు నిర్మించారు.
నేను ప్రైవేటు స్కూల్ నుంచి ఇక్కడ చేరిన. ఈ బడి ప్రైవేటు స్కూల్ కన్నా బాగుంది. రంగులు, మొక్కలతో చాలా కొత్తగా కనిపిస్తున్నది. లైట్లు, ఫ్యాన్లు పెట్టిండ్రు. మధ్యాహ్న భోజనం కూడా మంచిగ పెడుతున్నరు.
-అనురాధ, 5వ తరగతి
ప్రభుత్వ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. విద్యార్థులకు సకల సౌకర్యాలూ కల్పించారు. కార్పొరేట్ ప్లే స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. తాగునీరు, విద్యుత్, టాయిలెట్లు, వాష్ బేసిన్లు, కిచెన్షెడ్తోపాటు తరగతి గదుల్లో లైట్లు, ఫ్యాన్లు, డ్యుయల్ డెస్క్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు ఇబ్బంది లేకుండా బోధిస్తున్నారు. ఎమ్మెల్యే షకీల్, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
-రమాదేవి, ప్రధానోపాధ్యాయురాలు