ఎల్లారెడ్డి రూరల్, నవంబర్ 17: సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు రెట్టింపు పోషక విలువలు అవసరమవుతాయి. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే మాతాశిశు సంరక్షణ శాఖ వినూత్నంగా ఆలోచించి అంగన్వాడీ కేంద్రాల్లోనే పెరటితోటలను ప్రారంభించి, పోషక విలువలు ఉన్న కూరగాయలను పండిస్తూ కేంద్రానికి వచ్చే వారికి అవగాహన కల్పిస్తున్నారు. దీంట్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లోని ఖాళీ స్థలాల్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. పోషక విలువలు ఉన్న కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతిలో పండిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
అంగన్వాడీ టీచర్లకే బాధ్యతలు..
ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, గాంధారి మండలాల్లో కలిపి 44 అంగన్వాడీ కేంద్రాల్లో సేంద్రియ పద్ధతిలో పెరటితోటలను పెంచుతున్నారు. ఆకుకూరలు (పాలకూర, మెంతికూర, పుంటికూర, కొత్తమీర, మునగ), కూరగాయలు, పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు పెరటితోటల సంరక్షణపై పూర్తి బాధ్యత వహిస్తూ వాటి పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పెంచడమే కాకుండా ఇంటి వద్ద కూడా పెరటితోటల పెంపకంపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి రసాయన మందులు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పెరటితోటలను సాగుచేస్తున్నట్లు అంగన్వాడీ టీచర్లు తెలిపారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని ఖాళీ స్థలాల్లో పెరటి తోటలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకు కూరలు , పండ్లు పండించి వాటిని వండి ఆహారంగా అందిస్తున్నారు. మరోవైపు బాలింతలు, గర్భిణుల కోసం ఇంటి వద్ద ఖాళీ స్థలాల్లో పెరటి తోటలను పెంచేలా అవగాహన కల్పిస్తున్నారు.
పెరటితోటలను ప్రోత్సహిస్తున్నాం..
అంగన్వాడీ కేంద్రాలతోపాటు ఇంటి పరిసరాల్లో పెరటితోటల పెంపకంపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. ఖాళీ స్థలం ఉన్న అంగన్వాడీ సెంటర్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా పెరటితోటలను సేం ద్రియ పద్ధతిలో పెంచుతున్నాం. దీంతో ఆర్థికభారం తగ్గడమే కాకుం డా సెంటర్కు వచ్చే గర్భిణులు, బాలింతలకు పోషకాలు ఉండే తాజా కూరగాయలతో భోజనం పెడుతున్నాం.
– పద్మ, ఇన్చార్జి సీడీపీవో, ఎల్లారెడ్డి
సీడీపీవో ఆదేశాల మేరకు..
సీడీపీవో ఆదేశాల మేరకు అంగన్వాడీ సెంటర్లో పెరటితోటను పెంచుతున్నా. పూర్తిగా సేంద్రి య పద్ధతిలో సాగు చేస్తున్నాను. కిచెన్ గార్డెన్తో సెంటర్కు కూరగాయల కొనుగోలు ఖర్చు తగ్గడమే కాకుండా, బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు నాణ్యమైన కూరగాయలతో భోజనం పెడుతున్నాం. నేను పెంచుతున్న కిచెన్గార్డెన్లో వంకాయ, టమాట, పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, చిక్కుడుకాయ, గోంగూర తదితర ఆకుకూరలు, కూరగాయలు ఉన్నాయి.
– కాట్రోత్ మీరి, అంగన్వాడీ టీచర్, హాజీపూర్ కట్టకింది తండా