సారంగాపూర్, నవంబర్ 25: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి నిరసన సెగ తగిలింది. నిజామాబాద్ మండలంలోని పాల్దా గ్రామంలో మంగళవారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో ఎమ్మెల్యే పాల్గొనగా.. పలువురు స్థానికులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే ప్రసంగిస్తూ.. తమ ప్రభుత్వం పేదలకు ఉచితంగా కరెంటు ఇస్తున్నదని చెప్పగా.. అక్కడే ఉన్న మల్లారం నరేందర్ తాను ఉచిత కరెంటుకు అర్హుడనని, అయినా జీరో బిల్లు రావడం లేదని ఎమ్మెల్యేతో తెలిపాడు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలుపగా.. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తున్నది కదా అని మరో స్థానికుడు కల్లెడ మారుతి గట్టిగా అరిచాడు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురై.. ఆడెవడో బీజేపీకి చెందిన వాడై ఉంటాడు. అతడిని పంపించేయండని సూచించాడు. స్టేజీపైన ఉన్న కొందరు కాంగ్రెస్ నాయకులు కిందికి దిగి వచ్చి ప్రశ్నించిన వారితో వాగ్వాదానికి దిగారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించగా.. తామెందుకు వెళ్లాలని వాగ్వాదానికి దిగారు.
ఈక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ఒకరు నరేందర్పై చేయి చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులు జోక్యం చేసుకొని ఇద్దరినీ చెదరగొట్టారు. అకారణంగా తమపై చేయిచేసుకోవడం ఏమిటని బాధితులు నరేందర్, మారుతి ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు కూడా తమను నెట్టివేయడం తగదన్నారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామానికి 48 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయగా.. 24పూర్తయ్యాయి. మిగిలినవి అసంపూర్తిగా ఉన్నాయి. పనులు పూర్తి చేసిన అనంతరం వాటిని పంపిణీ చేయాల్సి ఉండగా.. అధికారులు, ప్రజా ప్రతినిధులు వాటిని కూడా లాటరీ పద్ధతిలో కేటాయించడం గమనార్హం. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నాయకులు బాగారెడ్డి, అగ్గు భోజన్న, జనార్దన్, మోహన్, ప్రతాప్రెడ్డి, నరేశ్, ఇన్చార్జి తహసీల్దార్ వినయ్సాగర్ పాల్గొన్నారు.