నిజామాబాద్ రూరల్, మార్చి 22: తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎప్పటిమాదిరిగా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యతను కేంద్రం విస్మరించి, మొండి వైఖరి అవలంబించడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు అమలుచేస్తున్నారని అన్నారు. అన్నదాతకు పంట పెట్టుబడి సా యం, రైతుబీమా, సాగుకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తుండడంతో రైతులు వరి సాగు పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఈ యాసంగిలో 70 శాతం మంది రైతు లు వరి పంటనే పండించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేక తెలంగాణ ప్రభుత్వంపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని గతేడాది నుంచి మొండివైఖరిని అవలంబిస్తున్నదని మండిపడ్డారు. ఇంతకుముందు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ధాన్యం కొనుగోలు చేయాలని విన్నవించినప్పటికీ ప్రయోజనం లేకపోగా నిర్లక్ష్య ధోరణిని మాత్రం వీడడంలేదన్నారు. పంజాబ్లో రెండు సీజన్లలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేస్తోందని, తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఈ నెల 26న ప్రతి గ్రామపంచాయతీ, 27న మండల పరిషత్, 30న జిల్లా పరిషత్ సమావేశాల్లో ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించనున్నట్లు చెప్పారు. ఈ తీర్మానాలకు కేంద్రం స్పందించకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రైతులు కలిసిరావాలని కోరారు.
హిందుత్వాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్న బీజేపీ నేతలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి హిందూ మతతత్వాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొంటున్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు యువతను పక్కదారి పట్టిస్తున్నారని బాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బోధన్లో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలోనూ బీజేపీ నాయకుల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అశాంతి, అలజడులు సృష్టించడం మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు లక్ష్మీనర్సయ్య, టీఆర్ఎస్ డిచ్పల్లి, ధర్పల్లి మండల అధ్యక్షులు చింత శ్రీనివాస్రెడ్డి, మహిపాల్ యాదవ్, నిజామాబాద్ మాజీ జడ్పీటీసీ మోహన్ పాల్గొన్నారు.