ఖలీల్వాడి, ఫిబ్రవరి 20 : 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిజామాబాద్ నగరపాలక సంస్థ ప్రతిపాదించిన బడ్జెట్ ఆమోదం పొందింది. సోమవారం స్థానిక న్యూఅంబేద్కర్ భవన్లో నగర మేయర్ దండు నీతూకిరణ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడు బిగాల గణేశ్ గుప్తా, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొన్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్తోపాటు 2022-23 సవరించి అంచనా బడ్జెట్ను సమావేశంలో ప్రవేశపెట్టగా, కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. 2022 ఏప్రిల్ 1వ తేదీ నాటికి ప్రారంభ నిల్వ రూ.8257.68 లక్షలు, 2022-23 సవరణ అంచనా సాధారణ ఆదాయం రూ.8777.10 లక్షలు కలుపుకొని మొత్తం రూ.17034.78 లక్షలుగా పేర్కొన్నారు. 2023-2024లో అంచనా సాధారణ ఆదాయం రూ.17303.77 లక్షలుగా బడ్జెట్లో పొందుపర్చారు.
వ్యయం రూ.9007.44 లక్షలుగా అంచనా వేస్తూ 2022-24 మార్చి నెలాఖరు నాటికి రూ.8296.33 లక్షలు మిగులు బడ్జెట్గా ఉంటుందని అంచనావేశారు. అదేవిధంగా 2023-2024లో అంచనా క్యాపిటల్ ఆదాయం రూ.17127.65 లక్షలు వ్యయం రూ.17059.50 లక్షలుగా డిపాజిట్లు రూ.1120.00 లక్షలుగా, అప్పులు రూ.1100.00 లక్షలుగా బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ మేరకు సమావేశంలో బడ్జెట్ ఆమోదం పొందిందని మేయర్ ప్రకటించారు. ఈ సందర్భంగా తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి కృషిచేస్తామని ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, మేయర్ నీతూకిరణ్ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగర పాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.