అత్యాధునిక వైద్య సేవలకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ రాష్ట్రంలో గుర్తింపు సాధించింది. లక్షలాది రూపాయలు ఖర్చయ్యే వైద్య సేవలు సైతం ఉచితంగా అందుతున్నాయి. ప్రతిరోజూ ఓపీ సంఖ్య 1500 దాటుతుండడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి 29 మంది మల్టీ స్పెషాలిటీ వైద్యులను నియమిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.
ఖలీల్వాడి, ఏప్రిల్ 17 : ఒకప్పుడు సర్కారు దవాఖానల్లో సరైన వసతులు, డాక్టర్లు, సరిపడా సిబ్బంది లేక అటువైపు చూసేందుకే ప్రజలు భయపడేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. పేద, మధ్య తరగతి వారికి వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో సర్కారు దవాఖానలను ఆధునీకరించారు. అత్యాధునిక పరికరాలు, పూర్తిస్థాయిలో సిబ్బంది, వైద్య నిపుణులను అందుబాటులోకి తెచ్చారు. రోగులను నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీ చర్యలు చేపట్టి ప్రజారోగ్యానికి భరోసా కల్పించారు. ప్రభుత్వ దవాఖాన పేరు చెబితేనే వెనకడుగు వేసినవారంతా నేడు సర్కారు వైద్యశాలలకు క్యూ కడుతున్నారు. కార్పొరేట్స్థాయి సేవలు, అరుదైన శస్త్ర చికిత్సలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుటున్న నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో రోగులకు మరింత నాణ్యమైన వైద్యం అందనున్నది. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్కు పేషంట్ల తాకిడి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వివిధ డిపార్ట్మెంట్లలో మరో 29 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులను పంపిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఇటీవలే ప్రకటించారు.
నిజామాబాద్ జీజీహెచ్లో మొత్తం 25 విభాగాలున్నాయి. ఇందులో 200 మంది వైద్యులు పని చేస్తున్నారు. దీంతో రోజువారీ ఓపీ 400 నుంచి 1500కు పెరిగింది. దవాఖానలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తూ రోగుల యోగక్షేమాలు చూసుకుంటున్నారు. దీంతో ప్రజల్లోనూ ప్రభుత్వ వైద్యశాలపై నమ్మకం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో పేద కుటుంబాలకు అండ దొరికింది. దీంతోపాటు తాజాగా మరో 29 మంది మల్టీ స్పెషాలిటీ వైద్యులు రానుండడంతో రోగులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో అత్యాధునిక, నాణ్యమైన సేవలు అందుతున్నాయి. కొవిడ్ సమయంలో కరోనా సోకిన గర్భిణులకు వైద్యం అందించి సురక్షితంగా ప్రసవాలు చేయడంతో జీజీహెచ్కు మంచి పేరు వచ్చింది. దీంతోపాటు అనేక అరుదైన శస్త్ర చికిత్సలు నిర్వహించి ప్రశంసలు అందుకున్నది. ఇప్పటి వరకు 253కి పైగా మోకీలు చిప్పల మార్పిడి చేసిన ఘనత దక్కించుకున్నది. రూ. 5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చయ్యే మోకీలు చిప్పల మార్పిడిని ఉచితంగా చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు రోజుకు రూ.5వేల విలువైన డయాలసిస్ సేవలను ప్రతినెలా దాదాపు 90 మందికి పైగా రోగులకు అందిస్తున్నారు. గుండెకు సంబంధించిన సమస్యలు వస్తే ఈసీజీ తీసి క్షణాల్లో గుర్తిస్తున్నారు. సమస్య ఉన్నదని గ్రహిస్తే వెంటనే మెడికల్ ఇంటెన్సివ్కేర్ యూనిట్కు తరలించి రూ.40వేల విలువైన ఇంజెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కరోజులోనే 60కి పైగా వివిధ రకాల ఆపరేషన్లు చేసిన రికార్డు కూడా జీజీహెచ్కు ఉన్నది.
జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్తోపాటు నిత్యం సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణతో దవాఖానలో నిర్లక్ష్యం లేకుండా సేవలందుతున్నాయి. దీంతో అనేక అవార్డులు సైతం వరించాయి. దీనికితోడు మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల, బాజిరెడ్డి కృషితో అత్యాధునిక వైద్య పరికరాలు, రోగులకు కార్పొరేట్ వసతులు కల్పించారు. సీటీస్కాన్, డిజిటల్ ఎక్స్రే, ఇతర స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. పాథలాజికల్ ల్యాబ్ ఏర్పాటు చేసి అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే క్యాథ్ల్యాబ్ సేవలు సైతం అందుబాటులోకి రానుండగా, గుండె శస్త్ర చికిత్సలు కూడా చేయనున్నారు. ఇప్పటికే అనేక రకాల సేవలు అందుబాటులో ఉన్న జీజీహెచ్లో మరో 29 మంది మల్టీ స్పెషాలిటీ డాక్టర్ల నియామకంతో నాణ్యమైన సేవలు అందుబాటులోకి రానున్నాయని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఒకప్పుడు ప్రభుత్వ వైద్యం చేయించునేందుకు ఆసక్తి కనబర్చని ప్రజలే నేడు క్యూ కడుతున్నారు. దీంతో జీజీహెచ్లో రోగుల రద్దీ పెరిగింది. అన్ని రకాల రోగాలకు వైద్యులు అందుబాటులో ఉండడంతో చాలా మంది ప్రైవేటు దవాఖానలకు వెళ్లడంలేదు. మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు వస్తే రోగులకు మరింత మెరుగైన వైద్యం అందుతుంది.
-డాక్టర్ జలగం తిరుపతిరావు, ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల
జీజీహెచ్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వైద్యుల పర్యవేక్షణ బాగుంది. ఓపీతోపాటు ఇన్ పేషంట్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతున్నది. కొత్తగా 29 మంది వైద్యులు వస్తే అనేక రకాల శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. రోగులు మహా నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
-నిమ్మల బాల్రాజు,
డిప్యూటీ సూపరింటెండెంట్, జీజీహెచ్
రాష్ట్ర సర్కారు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తేవడంతో ప్రజలకు భరోసా కలిగింది. జీజీహెచ్లో పూర్తిస్థాయి సిబ్బంది, వైద్యులు ఉన్నారు. మంచి వైద్యం అందడంతో ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రతి రోజూ ఓపీ సంఖ్య 1500 దాటుతున్నది. పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని మరో 29 మంది మల్టీ స్పెషాలిటీ డాక్టర్లను నియమించడం సంతోషకరం. ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ప్రతిమారాజ్, సూపరింటెండెంట్, జీజీహెచ్