ఖలీల్వాడి, జూలై 23 : సీఎం కేసీఆర్ అమలుచేసిన దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. దళితులకు యూనిట్లు మంజూరయ్యాయి. ముగ్గురు లబ్ధిదారులు వివిధ షాపులను ఏర్పాటు చేసుకోగా.. వాటిని ఆయన శనివారం ప్రారంభించారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో వైష్ణవి దుర్గా టెంట్హౌస్, ఇంద్రాపూర్లో వాల్మీకి డీజే దుకాణం, కసాబ్గల్లీలోని షగున్ టెక్స్టైల్స్ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తున్నారన్నారు. దళితులు ఆర్థికాభివృద్ధి సాధించేలా దళితబంధు పథకం ద్వారా రూ.10 లక్షలు అందజేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వసతిగృహాల నిర్వహణపై సమీక్ష
నగరంలోని క్యాంప్ కార్యాలయంలో పోస్ట్, ప్రీ మెట్రిక్ హాస్టళ్ల నిర్వహణపై సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమశాఖల అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకోవాలని తపించే ప్రతి విద్యార్థికీ ప్రభుత్వ హాస్టల్లో వసతి కల్పించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని, ఆడపిల్లలు చదువుకునే హాస్టల్లో అవసరమైన భద్రత కల్పించాలని సూచించారు. హాస్టళ్లు శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులను సమన్వయం చేస్తూ హెల్త్ క్యాంప్లు నిర్వహించాలని, కాస్మోటిక్ డబ్బులను ప్రతినెలా ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతి నివేదికల గురించి చర్చించాలన్నారు. సమావేశంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, ఏఎస్డబ్ల్ల్యూవో భూమయ్య, వార్డెన్లు బాలకృష్ణ, శోభ, అధికారులు పాల్గొన్నారు.