మోదీ సర్కారు రైతుపై కక్షగట్టింది. వ్యవసాయాన్ని నిస్తేజం చేసేందుకు యత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం సాగుపై కత్తి దూస్తున్నది. సంపన్నులకు పెద్దపీట వేస్తూ, సామాన్య రైతులను నిర్లక్ష్యం చేస్తున్నది. నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఆందోళనకు గురి చేసిన బీజేపీ సర్కారు.. ఇప్పుడు మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుండగా, కేంద్ర సర్కారు నుంచి కనీస మద్దతు కరువైంది. ఇప్పటికే ఇంధన ధరలను ఇష్టానుసారంగా పెంచేసిన కేంద్రం రైతులపై పెనుభారం మోపింది. వ్యవసాయంలో యాంత్రీకరణపై డీజిల్ రేట్ల పెరుగుదల ప్రభావం తీవ్రంగా చూపుతున్నది. ఇంధన ధరలను నియంత్రించక పోవడంతో ఉమ్మడి జిల్లాలోని రైతుల మీద ఒక్కో సీజన్లో అదనంగా రూ.140 కోట్ల భారం పడుతున్నది. బీజేపీ సర్కారు తీరుతో పేదలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిజామాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఒకప్పుడు దుక్కి దున్నాలన్నా..నాట్లు వేయాలన్నా..కలుపు తీయాలన్నా.. ఇలా ఏ పని చేసినా వ్యవసాయ కూలీలే గతి. రోజువారీ కూలీలతో వ్యవసాయ పనులను సాగించేది. కాలం మారింది. ఆధునిక సమాజంలో సాంకేతిక వినియోగం పెరగడంతో వ్యవసాయ రంగం సైతం తీవ్రంగా ప్రభావితమైంది. అందివచ్చిన అవకాశాలను రైతులు సైతం వాడుకుంటున్నారు. సాగులో యంత్రాలను విరివిగా వాడుతుండడంతో దశాబ్ద కాలంలో మనుషుల స్థానంలో యంత్రాలు వచ్చి చేరాయి. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన ఎనిమిదేండ్లలో యాంత్రీకరణ పెద్ద ఎత్తున జరిగింది. ఊరూరా ట్రాక్టర్లు, నాట్లు వేసే యంత్రాలు, కలుపు తీసే పరికరాలు వచ్చేశాయి. ఇలా సాఫీగా జరుగుతున్న సాగుబడిలో కేంద్రంలో అధికారం చలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ గడిచిన మూడేండ్లుగా ఇంధన పోటుతో రైతులను క్షోభకు గురిచేస్తున్నది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగా మద్దతు లభిస్తున్న తరుణంలో కేంద్ర సర్కారు నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మోదీ చర్యలతో అన్నదాతలు సతమతమవుతున్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2014 జూన్లో డీజిల్ ధర రూ.55 ఉండగా ఇప్పుడు రెట్టింపు చేశారు. తద్వారా రైతుల బతుకులను కేంద్ర సర్కారు గందరగోళంలో పడేసింది.
ఒక్కో సీజన్లో రూ.140 కోట్ల బాదుడు
డీజిల్ ధరలతో నిత్యవసరాలు, కూరగాయల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. రవాణా ఖర్చులు పెరుగుతుండడంతో నిత్యావసరాల ధరలు గబగబా ఎగబాకుతున్నాయి. అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతుండగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మాత్రం కనీసం చీమ కుట్టినైట్లెనా లేకపోవడం విడ్డూరంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇందులో వరి 60శాతం మేర సాగవుతున్నది. ఇతర పంటలు మిగిలిన భూముల్లో సేద్యం చేస్తున్నారు. ప్రస్తుతం డీజిల్ ధర లీటర్కు రూ.100 ఉంది. వ్యవసాయ రంగంలో డీజిల్ వాహనాలే అత్యధికంగా ఉండడంతో పెరిగిన ధరలతో ప్రతి పనికి రేటు పెరిగింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రోజుకు 15లక్షల నుంచి 18లక్షల లీటర్ల డీజిల్ వినియోగం అవుతుందని పెట్రోలియం ఉత్పత్తుల విక్రయదారుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. పెట్రోల్ సుమారుగా 14లక్షల వరకు వినియోగం అవుతున్నది. ఇంధన ధరల ప్రభావం గత యాసంగిలోనూ స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు మోదీ చర్యలతో మరోమారు వానకాలంలోనూ ప్రభావం చూపుతున్నది. ఎడాపెడా పెంచిన డీజిల్ ధరలతో వ్యవసాయ సీజన్లో రైతులపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అదనంగా రూ.140కోట్ల భారం పడుతున్నది.
రైతుపై పెనుభారం..
తరచూ పెరుగుతున్న చమురు ధరలతో అన్నదాతలు కుదేలవుతున్నారు. ఇది వరకు ఏడాదికి ఒకటి రెండుసార్లు పెంచినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. నిత్యావసరంగా మారిన ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సామాన్య ప్రజలతోపాటు అన్నదాతలకు కూడా కష్టాలు తప్పడం లేదు. వ్యవసాయం చేసుకునే వారికి పెరిగిన డీజిల్ ధరలను చూస్తే గుండె గుభేల్మంటున్నది. 2020 జూన్లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.49 ఉంది. ప్రస్తుతం రూ.112కి చేరింది. దాదాపుగా రూ.40 వరకు అదనపు భారం పడుతున్నది. డీజిల్ సైతం రెండేండ్ల క్రితం రూ.69.15 ఉండగా ఇప్పుడు లీటర్ డీజిల్ రూ.100 పలుకుతున్నది. డీజిల్పైనా దాదాపుగా రూ.30 పెరిగింది. ఇంతటి పెనుభారంతో వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి. వరి సాగుచేసే రైతుపై ఏడాదికి ఎకరానికి అదనంగా రూ.3వేల నుంచి రూ.3,500 వరకు ఖర్చు అవుతున్నది. ఇతర పంటలు సాగు చేసే వారిపై రూ.2వేల వరకు అదనపు వ్యయం వెచ్చించాల్సి వస్తున్నది. దుక్కిదున్నడం, నాట్లు వేయడం, పంట కోత, గడ్డి కట్టలు కట్టడం, మట్టి తరలింపు, పంట ఉత్పత్తులను మార్కెట్కు తరలించడం ఇలా అన్నింటిపైనా పెరిగిన డీజిల్ ధర ప్రభావం చూపుతున్నది. వాహన యజమానులు అద్దె పెంచుతున్నారు. గతేడాది ట్రాక్టర్ అద్దె గంటకు రూ.1100 ఉండగా ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో రూ.1400 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు.
చేతులెత్తేసిన బీజేపీ సర్కారు..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీరుతో సామాన్యజనంతోపాటు రైతులోకం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో కార్పొరేట్ పెద్దలు రోజురోజుకూ ఆదాయం పెంచుకుంటూ కుబేరులుగా మా రుతున్నారు. కిందిస్థాయిలో రైతులు, పేద కుటుంబాల పరిస్థితి రోడ్డున పడేలా మారిం ది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టలేక చేతులెత్తేసిన ఎన్డీయే సర్కారుతో కొంత కాలం గా ధరల పెరుగుదలలో అడ్డూ అదు పు అనేది లేకుండా పోయింది. కమలం పార్టీ కర్కశత్వంతో సామాన్య కుటుంబాలు చితికిపోతున్న దరిమిలా ఇప్పుడు రైతులు సైతం మోదీ అవలంబిస్తున్న చర్యలతో కకావికలం అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చర్యలతో వ్యవసాయ రంగం అడుగడుగునా నీరుగారుతున్నది. పెరిగిన ఇంధన ధరలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సాగు రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నది. వానకాలం ప్రారంభమవుతున్న సమయంలో యంత్రాల ఖర్చులు పెరగడంతో కర్షకులకు తిప్పలు తప్పడం లేదు. నాట్ల దగ్గరి నుంచి కోతల వరకు యంత్రాల వినియోగం భారీగా పెరిగిన సందర్భంలో ఇంధన ధరల పెరుగుదల సాగు రంగాన్ని దెబ్బతీస్తున్నది.