రాయపోల్, జూలై 23 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించాలనీ, అందుకు డిజిటల్ స్కిల్స్ దోహద పడతాయని మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సైన్స్ ల్యాబ్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ను ఎంఈఓ ప్రారంభించారు. రూ.1.50 లక్షలు విలువ చేసే ఈ ఇంటరాక్టివ్ ప్యానెల్ను ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేయించారు.
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ప్రారంభం అనంతరం ఎంఈవో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగి ఉన్న శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించడానికి డిజిటల్ స్కిల్స్ దోహద పడతాయని అన్నారు.
నేటి పోటీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని, దానికి అనుగుణంగా డిజిటల్ స్కిల్స్ నేర్పించడానికి ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు.

విద్యార్థుల కోసం ఈ ప్యానెల్ను అందించిన ఉపాధ్యాయుడు భాస్కర్ రెడ్డిని ఈ సందర్భంగా ఎంఈఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట గ్రామ సర్పంచ్ గీతా ప్రవీణ్, హెచ్ఎం ప్రమీల, ఉపాధ్యాయులు నవీన్, నర్సింలు గౌడ్, సంజీవ్, ప్రభాకర్, దివాకర్, రాజేంద్ర, అమరేందర్, కమలాకర్, ప్రసాద్, వసంత, పావని సీఆర్ఫీ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.