న్యూఢిల్లీ: నీట్ లీక్ వివాదంపై ఢిల్లీలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వారి డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. ఆత్మహత్యకు పాల్పడిన నీట్ విద్యార్థులకు నివాళి అర్పించారు. (Rahul Gandhi) గురువారం పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ‘ఇండియా’ కూటమికి చెందిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు అక్కడ చర్చలు జరిపారు.
కాగా, నీట్ పేపర్ లీక్ తర్వాత ప్రాణాలు కోల్పోయిన, నిరసనల సమయంలో గాయపడిన విద్యార్థులను స్మరించుకుని నివాళి అర్పించాలని రాహుల్ గాంధీ, ప్రతిపక్ష ఎంపీలు నిర్ణయించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీతో సహా ప్రతిపక్ష ఎంపీలు బస్సులో తీస్ జనవరి మార్గ్లోని రాజ్ఘాట్కు చేరుకున్నారు. నీట్ లీక్తో మనస్తాపం చెందిన ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.
మరోవైపు భారతదేశ విద్యార్థులు ఒంటరివారు కాదని, ప్రతిపక్షం మొత్తం వారికి, వారి డిమాండ్లకు అండగా నిలుస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. ఇండియా గేట్ను సందర్శించాలనుకున్న తమ తొలి ప్రణాళికను పోలీసులు తిరస్కరించినట్లు చెప్పారు. అలాగే గాంధీ స్మృతికి బయలుదేరిన తమ బస్సును కూడా మొదట అడ్డుకున్నారని, ఆ తర్వాత అనుమతించారని వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు విద్యార్థుల ఇతర డిమాండ్లకు తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.