తెలంగాణ పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. పంచాయతీలకు నిధులకుతోడు పల్లెప్రగతి వంటి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. తాజాగా పల్లెల ప్రగతిపై సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన జాబితా వెలువడగా.. అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఆరు గ్రామాలు అగ్రస్థానంలో నిలిచాయి. జాతీయస్థాయిలో పాల్దా (నిజామాబాద్ రూరల్) నాలుగోర్యాంకును, ఠాణాకుర్దు (మోపాల్) ఆరో ర్యాంకును సాధించాయి. వెల్మల్ (నందిపేట), కుకునూర్ (వేల్పూర్) ఎనిమిది, పది స్థానాల్లో నిలిచాయి. కౌలాస్(జుక్కల్) 18వ ర్యాంకును, రెంజల్ మండలం కందకుర్తి 20వ ర్యాంకును దక్కించుకున్నాయి.
తెలంగాణ పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. పంచాయతీలకు నిధులకుతోడు పల్లెప్రగతి వంటి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. అందుకే జాతీయస్థాయిలో అభివృద్ధి సూచికలేవి ప్రకటించినా, అందులో తెలంగాణ పల్లెలు ముందువరుసలో నిలుస్తున్నాయి. తాజాగా పల్లెల ప్రగతిపై సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన జాబితా వెలువడగా.. అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గ్రామాలు అగ్రభాగాన నిలిచాయి. 91.33 మార్కులతో నిజామాబాద్ రూరల్ మండలం పాల్దా జాతీయస్థాయిలో నాల్గోస్థానం సాధించింది. మోపాల్ మండలం ఠాణాకుర్దు ఆరో స్థానంలో నిలువగా.. నందిపేట మండలం వెల్మల్, వేల్పూర్ మండలం కుకునూర్ ఎనిమిది, పది ర్యాంకు లు సాధించాయి. జుక్కల్ మండలంలోని కౌలాస్ 18వ ర్యాంకును, రెంజల్ మండలం కందకుర్తి 20వ ర్యాంకు ను దక్కించుకున్నాయి.
నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 26 : నిజామాబాద్ మండలంలోని పాల్దా గ్రామం దేశంలోని టాప్ 10 గ్రామాల్లో 91.33 స్కోర్తో నాల్గో స్థానంలో నిలిచింది. దీంతో పాల్దా గ్రామ పేరుప్రతిష్టలు దేశవ్యాప్తంగా చాటడంపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడేండ్ల క్రితం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారానే పచ్చదనం, పరిశుభ్రతతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించిన ఫలితంగానే తొలుత పాల్దా గ్రామం జిల్లాస్థాయిలో ఉత్తమ జీపీగా ఎంపికైంది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారుల ప్రత్యేక శ్రద్ధ, ప్రజాప్రతినిధుల సహకారంతో పాల్దా గ్రామం అభివృద్ధివైపు పరుగులు పెడుతున్నది. జాతీయస్థాయిలో ఉత్తమ జీపీ అవార్డును అందుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని సర్పంచ్ సుప్రియా నవీన్ పేర్కొన్నారు.
నందిపేట్, ఏప్రిల్ 26 : రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో వెల్మల్ గ్రామం జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైంది. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామపంచాయతీ జాతీయ అవార్డుకు ఎంపిక కావడంపై గ్రామస్తులు, మండల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమా రు 12 వేల జనాభాతో 14 వార్డులతో ఉన్న ఈ గ్రామంలో ప్రజలకు అవసరమయ్యే కనీస మౌలిక సదుపాయాలతో పాటు ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు కావడం ఈ అవార్డు ఎంపికకు ఎంతో తోడ్పడింది. ప్రధానంగా గ్రామస్తులకు తాగునీరు, రోడ్లు, మురికి కాలువలు, విద్యా తదితర అన్ని వసతులతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు విజయవంతంగా అమలు కావడం, పల్లెప్రగతి ద్వారా అవసరాలను గుర్తించి వాటిని వెనువెంటనే తీర్చడంతో ఈ గ్రామం ముందుస్థాయిలో నిలిచింది. అధికారులు ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను గ్రామాల వారీగా పర్యవేక్షించగా వెల్మల్ గ్రామానికి 90.49 పాయింట్లు వచ్చాయి. దీంతో జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీకి ఎంపికైనట్లు ఎంపీవో కిరణ్కుమార్ తెలిపారు. ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ సాయమ్మ పేర్కొన్నారు.
వేల్పూర్,ఏప్రిల్ 26 : వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ఆసరాతో దేశంలో టాప్ 10 గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో తమ గ్రామం ఉత్తమ గ్రామంగా ఎంపికైనట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఒకప్పుడు గ్రామంలో కనీస సదుపాయాలు లేక అధ్వానంగా ఉండగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న వేముల ప్రశాంత్రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహంతో కనీస సదుపాయాలు నెలకొన్నాయి. ప్రభు త్వం అందిస్తున్న నిధులతో గ్రామం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నది.
ఖలీల్వాడి, ఏప్రిల్ 26 : నిజామాబాద్ రూరల్ మండలంలోని ఠాణాకుర్దు జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామంగా ఎంపిక కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. సీసీ రోడ్ల నిర్మాణం, హరితహారం కార్యక్రమం వంటి పనులను పూర్తిచేశారు. గ్రామంలో కేంద్ర బృందం పర్యటించి ప్రతిఒక్క అంశాన్ని పరిశీలించి నివేదికను కేంద్రానికి అందించి, స్కోర్ను ప్రకటించారు. జాతీయస్థాయిలో గ్రామం 90.77 స్కోర్ చేయగా ఆరో ర్యాంకు సాధించింది. నిరంతర కృషితో ఇదిసాధ్యమైందని సర్పంచ్ లత పేర్కొన్నారు.
వేల్పూర్, ఏప్రిల్ 26: సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై) పథకం కింద దేశంలో ఎంపికైన టాప్ 10లో పది గ్రామాలు తెలంగాణకు చెందినవేనని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ గ్రామాల్లో ఎంపికైన మొదటి పది గ్రామాలు, ఆ గ్రామాల సర్పంచులు, జిల్లా అధికారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే టాప్ 10లో నిలిచిన గ్రామాల్లో నిజామాబాద్ జిల్లాలోని పాల్దా, వెల్మల్, ఠాణాకుర్దు, కుకునూర్ గ్రామాలు ఉండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాసన పుత్రిక పల్లె ప్రగతి కార్యక్రమంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇప్పటికే స్వచ్ఛ, ఈ -పంచాయతీ, ఈ -ఆడిటింగ్, బహిరంగ మలవిసర్జన రహితం తదితర అంశాల్లో నిజామాబాద్ జిల్లాలోని గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఒకప్పుడు గంగ దేవి పల్లెను మాత్రమే రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా పేర్కొనే పరిస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ..గ్రామ పంచాయతీలకు నిధులు, అదనపు వనరులు, హంగు లు కల్పించడంతో గ్రామాలు అన్ని రంగాల్లో ఆదర్శంగా మారుతున్నాయని, ఇందుకు తాజాగా ఉత్తమ గ్రామాల ఎంపికనే నిదర్శమని పేర్కొన్నారు.