ఖలీల్వాడి, మార్చి 22: వంట నూనెల ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధంతో ఈ ప్రభావం మరింత ఎక్కువైంది. 20 రోజుల వ్యవధిలోనే కిలో నూనె ప్యాకెట్కు రూ.70 పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు నూనె కొనాలంటేనే జంకుతున్నారు. నూనె ధరలు ఒక్కసారిగా పెరగడంతో అన్నివర్గాల ప్రజలను కలవరపెడుతున్నాయి. గతంలో కిలో నూనె ధర రూ.120 నుంచి రూ.140 మధ్య ఉండగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూ.160 నుంచి రూ.220కి పెరిగింది. మరోవైపు నూనె దిగుమతుల ప్రభావాన్ని అదనుగా మలుచుకొన్న కొంతమంది వ్యాపారులు కొత్త దందాకు తెరలేపారు. ఉక్రెయిన్ నుంచి నూనె రావడం లేదని రేట్లు ఆకాశానికి పెంచారు. ఆయిల్పై ఉన్న ఎమ్మార్పీ ధర రూ.130 ఉండగా స్టిక్కర్లు అతికించి రూ.190కి అమ్ముతున్నారు. కొత్తగా వస్తున్న నూనె ప్యాకెట్ల ఎమ్మార్పీ ధరలు రూ.260 ఉండడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వ్యాపార సంస్థలు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు ధరలు పెంచలేదని, ఎన్నికలు పూర్తికాగానే బీజేపీ ధరలు పెంచుడు మొదలు పెట్టిందని ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్పై ఒకేసారి రూ.50 పెంచడం అమానుషమని, గ్యాస్, పెట్రోల్, డీజిల్తోపాటు నిత్యావసర వస్తువులపై కేంద్రం ఇష్టారీతిన ధరలు పెంచుతూ ప్రజలపై అధిక భారం మోపుతున్నదని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు బీజేపీకి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో నూనె ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఆయిల్కు ఎలాంటి కొర త లేదు. కానీ ధరలు మాత్రం ఆకాశానికి పెంచేశారు. ఇలాగే ఉం టే ప్రజలు చాలా ఇబ్బందులుపడతారు. దుకాణాలకు వచ్చే వినియోగదారులు ధరలను చూసి కొనడానికి జంకుతున్నారు. ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– అశోక్, దుకాణాదారుడు