చండూరు, జూలై 25 : ఇటలీలో జరిగే అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు నల్లగొండ జిల్లా మునుగోడు మహాత్మ జ్యోతిబా పూలే బాలుర బీసీ గురుకుల విద్యార్థి వడ్త్యా హనుమంత్ ఎంపికయ్యాడు. నల్లగొండ జిల్లా, పీఏ.పల్లి మండలం, నంబాపురం గ్రామానికి చెందిన నిరుపేద కూలీ దంపతులు వడ్త్యా సైదా, సుజాతల కుమారుడు వడ్త్యా హనుమంత్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం ఈ విద్యార్థి మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు మహాత్మ జ్యోతిబా పూలే బాలుర బీసీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు.
జాతీయ స్థాయి : వడ్త్యా హనుమంత్ జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి సిల్వర్, బ్రాంజ్ పతకాలను సాధించాడు.
అంతర్జాతీయ స్థాయి : గతంలో చెక్ రిపబ్లిక్లో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికైనప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆ సమయంలో వెళ్లలేకపోయాడు. తాజాగా ఇటలీలో జరిగే పోటీలకు మరోసారి ఎంపికై తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వడ్త్యా హనుమంత్ ప్రతిభను పలువురు ప్రముఖులు అభినందించారు. విద్యార్థిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ గురుకుల సెక్రటరీ బి.సైదులు, నల్లగొండ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ఇ.స్వప్న, పాఠశాల ప్రిన్సిపాల్ జాల.రామకృష్ణ, ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి, భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు బీసీ గురుకుల విద్యార్థి వడ్త్యా హనుమంత్ ఎంపిక