ఖలీల్వాడి, ఫిబ్రవరి 20 : ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఎర్రజొన్న దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో కలెక్టర్ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రైతులతో కుదుర్చుకున్న బైబ్యాక్ ఒప్పందానికి కట్టుబడి కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. ఎర్రజొన్న సాగుకు అవసరమైన విత్తనాల సరఫరా, రైతులతో ఒప్పందం కుదుర్చుకునే విధానం, విత్తనాల వెరైటీలు తదితర అంశాలపై వ్యాపారులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు.
రైతుల నుంచి సేకరించిన ఎర్రజొన్న పంటను ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తామని, అక్కడ ఎర్రజొన్ననను పశువులకు దాణాగా వినియోగిస్తారని సీడ్ కంపెనీల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గతేడాది సాగు చేసిన ఎర్రజొన్న పంటను పలువురు రైతులు కోల్డ్ స్టోరేజ్ల్లో నిల్వ చేసుకుని ఈ ఏడాది విక్రయించారని తెలిపారు. అయినప్పటికీ ఈసారి అత్యధిక మంది మక్కజొన్న పంట వైపు మొగ్గుచూపడంతో ఎర్రజొన్న సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. ఫలితంగా ప్రస్తుతం మార్కెట్లో ఎర్రజొన్న పంటకు ఆశించిన రీతిలోనే మంచి డిమాండ్ ఉందని తెలిపారు.
రైతులతో కుదుర్చుకున్న ఒప్పందానికి మించి ఎర్రజొన్నకు ఎక్కువ మొత్తంలో ధర పలుకుతున్నదని పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలకు తావు లేకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.