కామారెడ్డి, నవంబర్ 13 : కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గంలో 95 నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 58 నిమినేషన్లు వేయగా ఆరు రిజెక్ట్ అయ్యాయని తెలిపారు. జుక్కల్లో 23 నామినేషన్లు వేయగా నాలుగు, ఎల్లారెడ్డిలో 14 నామినేషన్లు వేయగా రెండు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. మొత్తం 95 నామినేషన్లకుగాను 12 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని వెల్లడించారు.
బాన్సువాడ, నవంబర్ 13 : నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో 19 నామినేషన్లకుగాను రెండు రిజెక్ట్ అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి భుజంగరావు సోమవారం ఒక ప్రకనలో తెలిపారు.
నిజామాబాద్ స్పోర్ట్స్, నవంబర్ 13 : నిజామాబాద్ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ సోమవారం నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. 26 మంది అభ్యర్థులు దాఖలు చేసిన అన్ని సెట్ల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయని వెల్లడించారు. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 128 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా.. స్క్రూటినీలో 26 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. 102 మంది అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయని స్పష్టం చేశారు. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 21 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా.. ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని పేర్కొన్నారు.
బోధన్ నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా.. 8 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని వివరించారు. బాన్సువాడ సెగ్మెంట్లో 17 మంది అభ్యర్థులవి చెల్లుబాటు కాగా.. ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని, నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్లో 23 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా.. 8 మంది అభ్యర్థులవి తిరస్కరణకు గురయ్యాయని, రూరల్ నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థుల నామపత్రాలు చెల్లుబాటు కాగా.. ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు వివరించారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 9 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని, ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు.