ఉగ్రవాద కార్యకలాపాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో నిందితులు, అనుమానితుల కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి, ఆటోనగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, బోధన్, నవీపేట, ఆర్మూర్, ఎడపల్లిలో మొత్తం 23 ఇండ్లలో ఆదివారం తెల్లవారు జామున 3 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అధికారులు సోదాలు నిర్వహించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి పాస్పోర్టులు, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణకు హాజరుకావాల్సిందిగా మరికొంతమందికి నోటీసులు జారీ చేశారు.
నిజామాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లాలో మరోసారి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సోదాలు కలకలం రేపాయి. మూడు నెలల క్రితం ఆర్మూర్లో తనిఖీలు చేపట్టి ఇద్దరు యువకులను ప్రశ్నించగా, తాజాగా ఏక కాలంలో 23 చోట్ల సోదాలు చేశారు. బోధన్, అర్సపల్లి, ఆటోనగర్, నవీపేట, ఆర్మూర్, నిజామాబాద్లో తనిఖీలు కొనసాగాయి. ప్రత్యేక బృందాలుగా వచ్చిన ఎన్ఐఏ టీములు స్థానిక పోలీసులతో సంబంధం లేకుండా తెల్లవారుజాము నుంచే తమ పని షురూ చేశారు. పీఎఫ్ఐతోపాటు మరే ఇతర సంస్థలతో సంబంధాలున్నాయనే కోణంలో పరిశీలించారు. కరాటే పేరుతో జరిగిన తతంగం వెనుక దాగిఉన్న కుట్రలను ఛేదించేందుకు ఎన్ఐఏ తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తున్నది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కేసులో జూలై 4న నలుగురిపై దేశద్రోహం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం 29 మందిపై చార్జిషీట్ వేశారు. ఇప్పటి వరకు సగం మందిని అరెస్టు చేయగా, వీరితో లింకులు ఉన్నవారిపై ఎన్ఐఏ నిఘా పెట్టి సోదాలు చేస్తున్నది. నిజామాబాద్లో వెలుగుచూసిన కేసులో ఇతర జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోనూ సంబంధాలు ఉండడం గమనార్హం.
ఎవరెవరికి లింకులు?
పీఎఫ్ఐకి సంబంధించిన చార్జిషీట్ ఆధారంగా కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించినవారి ఇండ్లల్లోనే ఎన్ఐఏ మొదట తనిఖీలు చేపట్టింది. మదర్సాలలో ఎంపికచేసిన యువకులకు మతద్వేషాలను రెచ్చగొట్టడం, మతకల్లోలాలు, గొడవలు సృష్టించడం, ఒక వర్గంపై దాడులకు ప్రేరేపించడం లాంటి అంశాల్లో వందలాది మందికి శిక్షణ ఇచ్చినట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, కడప, అనంతపూర్ జిల్లాలకు చెందిన యువతకు అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగింది. కరాటే ముసుగులో జరిగిన ఉగ్రకుట్రలో ఇంకా ఎవరెవరు భాగస్వామ్యమై ఉన్నారనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నది. జగిత్యాలవాసి అబ్దుల్ ఖాదర్ ప్రధాన శిక్షకుడిగా ఉండగా, షేక్ షాదుల్లా, ఎండీ ఇమ్రాన్, అబ్దుల్ మొయీన్ ఇప్పటికే దేశద్రోహం కేసుకింద అరెస్టయ్యారు. వీరితో ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్నగర్కు చెందిన ఓ యువకుడితో కీలక సంబంధాలు బయటపడ్డాయి. జూలై 31న ఆర్మూర్ పట్టణంలో ఎన్ఐఏ సోదాలు చేయగా, అనుమానిత యువకుడికి విదేశాల నుంచి డబ్బులు రావడం, విదేశీ కాల్స్ వంటివి వెలుగు చూశాయి.
23 చోట్ల సోదాలు..
నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు జూలై 4న తొలుత కేసు నమోదు చేశారు. ఆగస్టు 26న కేసు రిజిస్ట్రర్ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఆదివారం తెల్లవారుజామున అనుమానితుల ఇండ్లల్లో సోదాలు నిర్వహించింది. ఏక కాలంలో నిజామాబాద్ నగరంతోపాటు బోధన్, నవీపేట, ఆర్మూర్, ఎడపల్లిలో మొత్తం 23 ఇండ్లల్లో ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. ప్రింటర్లు, ఉర్దూ సాహిత్యంతోపాటు అనుమానిత వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రదాడులు, మతోన్మాద కుట్ర, ఇతర వర్గాలపై దాడులకు పాల్పడేలా శిక్షణ అందిస్తున్న పీఎఫ్ఐ నిర్వాహకుడు జగిత్యాల జిల్లాకు చెందిన అబ్దుల్ ఖాదర్తోపాటు 28 మందిపై ఇప్పటికే నిజామాబాద్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. రెండున్నర నెలల వ్యవధిలో ఎన్ఐఏ రెండుసార్లు నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. జూలై 31న ఆర్మూర్లో సోదాలు నిర్వహించారు. తాజాగా ఆదివారం నిజామాబాద్లోని ఆటోనగర్కు చెందిన సమీర్తోపాటు మాలపల్లి ఏరియాలో ఫిరోజ్ అనే మరో విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. డిగ్రీ సెకండియర్ చదువుతున్న సమీర్ వద్ద ప్రింటర్లు, ఉర్దూ సాహిత్యంతో పాటు అనుమానాస్పద సామగ్రి లభించింది. వీరిని హైదరాబాద్కు తరలించారు. కంఠేశ్వర్, ఎడపల్లి ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు యువకులకు సీఆర్పీసీ సెక్షన్ కింద విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. మూడు నెలల క్రితం పీఎఫ్ఐకి చెందిన కొంతమందిని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని వారి కార్యకలాపాలపై నిఘా పెట్టారు. పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్న మరికొంత మంది అనుమానితులను కూడా ఎన్ఐఏ తన జాబితాలో చేర్చినట్లు సమాచారం. పీఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గంపై కేసు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలిసింది.
ఎవరెవరు శిక్షణ తీసుకున్నారు ?
ఎన్ఐఏ బృందాలు జరిపిన సోదాల్లో ఎక్కువగా పీఎఫ్ఐలో శిక్షణ తీసుకున్న వారి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. చాలా రోజులుగా అర్సపల్లి అడ్డాగా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించారు. నిఘా వర్గాల సమాచారంతో ప్రత్యేక బృందాలు పీఎఫ్ఐ లింకులను చేధించింది. కరాటే నేర్పిస్తున్నట్లు బయటకు ప్రచారం జరుగుతున్నప్పటికీ మదర్సాలో ఎంపికచేసిన యువకులకు ఓ వర్గంపై దాడులకు పాల్పడడం, ఉగ్ర చర్యల్లో ఎలా పాలుపంచుకోవాలన్న తీరుపై శిక్షణను ఇచ్చినట్లు తెలిసింది. కరాటే ముసుగులో పీఎఫ్ఐ శిక్షణ తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో జాతీయ దర్యాప్తు సంస్థ కంగుతిన్నది. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఎవరెవరు శిక్షణ తీసుకున్నారో? వారందరి డాటాను సేకరిస్తున్నారు. సంఘ విద్రోహ కుట్రలకు ఏమైనా ఉసిగొల్పిన ఆనవాళ్లు ఉన్నాయా? అన్న కోణంలోనూ అనుమానితులను ఎన్ఐఏ ప్రశ్నించింది. ఆదివారం సోదాలు నిర్వహించిన వారిలో చాలా మందికి ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణ రావాల్సిందిగా కోరింది.
ఉలిక్కిపడిన నగరం
ఎనిమిది గంటలపాటు వేర్వేరు చోట్ల ఎన్ఐఏ సోదాలు
ల్యాప్ టాప్లు, పెన్ డ్రైవ్స్, సిమ్ కార్డులు సీజ్
నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 18 : జిల్లాకేంద్రంలోని పలువురి ఇండ్లల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించడంతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏకకాలంలో దాడులు చేశారు. దాదాపు ఎనిమిది గంటలపాటు కొనసాగిన సోదాల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ల్యాప్టాప్లు, పెన్డ్రైవ్లు, సిమ్ కార్డులను సీజ్ చేశారు. పీఎఫ్ఐ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న నగరంలోని ఆటోనగర్, అర్సపల్లి, మాలపల్లి, పూలాంగ్, గుండారం ప్రాంతాల్లో పలువురి ఇండ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న ఆటోనగర్కు చెందిన సమీర్ను అదుపులోకి తీసుకొని యువకుడి ఇంటి నుంచి సామగ్రిని సీజ్ చేశారు. మరో బృందం మాలపల్లి ఏరియాలో ఫిరోజ్ అనే మరో విద్యార్థి ఇంట్లో సోదాలు నిర్వహించింది. అనంతరం అతడిని సైతం అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించారు.
సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్
ఆటోనగర్కు చెందిన సమీర్ ఇంటి నుంచి ఎన్ఐఏ బృందం మూడు ల్యాప్ టాప్లు, పెన్డ్రైవ్లు, వివిధ నెట్వర్క్లకు చెందిన పది సిమ్కార్డులు, ఉర్దూ సాహిత్యాన్ని సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న సామగ్రి వివరాలతో అధికారులు అక్కడే పంచనామా కాపీ తయారు చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. పూలాంగ్, అర్సపల్లి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినప్పుడు అందుబాటులో లేనివారి కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేశారు. వారు నేడు (సోమవారం) హైదరాబాద్లోని ఎన్ఐఏ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
స్థానిక పోలీసులకు సమాచారం లేకుండానే..
ప్రత్యేక బృందాలుగా వచ్చిన ఎన్ఐఏ.. స్థానిక పోలీసులకు సమాచారం లేకుండానే రంగంలోకి దిగింది. దాడుల విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారంతో సీపీ నాగరాజు అలర్ట్ అయ్యారు. జిల్లాలో తనిఖీలు నిర్వహించే ముందు సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్చేసి వెంటనే రావాల్సిందిగా ఆదేశించారు. పోలీస్ ఆఫీసర్లతోపాటు స్పెషల్పార్టీ సిబ్బంది సీపీకి రిపోర్ట్ చేసి ఎన్ఐఏ బృందాల వెంట వెళ్లారు. సోదాలు నిర్వహించే సమయంలో ఎవరూ ఫోన్లు మాట్లాడకూడదని, ఇతరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకూడని ఆదేశించారు. ఒకవేళ సమాచారం లీక్ అయితే బాధ్యులను గుర్తించేందుకు సెల్ఫోన్లను ట్యాపింగ్లో పెట్టినట్లు సమాచారం.
బోధన్, ఎంఎస్సీ ఫారం, ఆర్మూర్లో తనిఖీలు..
శక్కర్నగర్/ఆర్మూర్, సెప్టెంబర్ 18: బోధన్ పట్టణంలోని రాకాసీపేట్ ప్రాంతానికి చెందిన ఓ పెయింటర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు ఆదివారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు. మూడు గంటలపాటు విచారణ అనంతరం పెయింటర్ నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈయన కొంతకాలం నిజామాబాద్లో ఉంటూ పీఎఫ్ఐ సంస్థ ద్వారా శిక్షణ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
ఎడపల్లి మండలంలోని ఎంఎస్సీ ఫారం గ్రామానికి చెందిన ముఖీం ఇంటికి సుమారు 3.30 గంటల ప్రాంతంలో వచ్చిన ఎన్ఐఏ అధికారులు.. ముందుగా అతడిని విచారించారు. ఎడపల్లి మండలకేంద్రంలో ఆన్లైన్ సర్వీస్ సెంటర్ నిర్వహించే అతడి పాస్పోర్టు, బ్యాంకు అకౌంట్ తదితర వివరాలను సేకరించారు. తాము సూచించిన సమయంలో హైదరాబాద్ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. అధికారులు తెల్లవారుజామునే ఇంట్లోకి వచ్చి ఏవైనా ఆయుధాలు ఉంటే ముందుగానే అప్పజెప్పాలని ఆదేశించినట్లు అతడు వెల్లడించారు.
ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్నగర్లో కేంద్ర దర్యాప్తు సంస్థ తెల్లవారుజామున సోదాలు నిర్వహించింది. మూడు నెలల క్రితం అనుమానితుడి అకౌంట్లోకి విదేశాల నుంచి డబ్బులు జమైన విషయం తెలుసుకొని విచారణ చేశారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారం తాజాగా కోసం సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.