జవహర్నగర్, ఆగస్టు 10: దమ్మాయిగూడ శ్రీ చైతన్య స్కూల్లో దారుణం జరిగింది. 9 మంది విద్యార్థులు రౌడీల్లా ప్రవర్తించి తోటి విద్యార్థిపై ప్లేట్లు, గ్లాసులు, చీపుర్లతో కొట్టి.. బూట్లతో తన్నడంతో తీవ్ర గాయాలైన ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లాకు చెందిన ఏరోళ్ల కిరణ్కుమార్, శోభ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అభిషేక్ను దమ్మాయిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో చేర్పించగా 10వ తరగతి చదువుతున్నాడు. కాగా యాజమాన్యం నిర్లక్ష్యంతో తోటి విద్యార్థులు దాడి చేశారని అభిషేక్ తల్లిదండ్రులు బోరున విలపించారు.
ఈ నెల 7న అర్ధరాత్రి విఘ్నేష్ 9 మందితో గ్యాంగ్లా ఏర్పడి అభిషేక్పై కొట్టడంతో వీపు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. మీ కొడుకు మెట్లపై నుంచి పడ్డాడంటూ యాజమాన్యం తప్పుడు సమాచారం ఇచ్చారని, వెంటనే పాఠశాల వద్దకు వచ్చి చూడగా నడవలేని స్థితిలో అభిషేక్ ఉన్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైంది బిడ్డా అంటూ ప్రశ్నించిన చెప్పలేదని.. ఇంటికి తీసుకెళ్లి అడగ్గా తనపై దాడి చేశారని తెలిపాడని వెల్లడించారు. సీసీ కెమెరాలు తీయండని.. దాడి విషయం చూస్తామంటే 3 నెలల నుంచి సీసీలు పనిచేస్తాలేవని చెప్పడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తుందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.