కవాడిగూడ/ఖైరతాబాద్, ఆగస్టు10: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ, చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద సోమవారం దళిత క్రైస్తవుల మహా నిరసన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణమాదిగ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ బాలకృష్ణ కమిషన్ కేవలం ఎనిమిది రాష్ర్టాల్లో సేకరించిన అభిప్రాయాలతో రిపోర్టును రూపొందించడం దళిత క్రిస్టియన్ల హక్కులను కాలరాయడమేనన్నారు.
బాలకృష్ణ కమిషన్పై స్పష్టతనిచ్చి నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రతిపక్షాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన దళితుల ఆర్థిక సామాజిక వెనుకబాటుతనం వివక్ష పూర్తిగా తొలగిపోలేదనే అంశాన్ని జస్టిస్ రంగనాథ్మిశ్రా కమిషన్ నివేదిక ప్రస్థావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రిపోర్టును పరిగణించకపోవడం సరికాదన్నారు.
మతం ఆధారంగా వివక్షను తొలగించి దళిత క్రైస్తవులు, ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలని వక్తలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ దళిత్ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎస్ఐ పాస్టర్ భాస్కరయ్య, కమిటీ ప్రతినిధులు స్వప్న, శైలజా, నతానియే మాట్లాడారు. 1950లో జారీ చేసిర ఉత్తర్వులు హిందూ మతానికి చెందిన దళితులకే ఎస్సీ హక్కులకు పరిమితం చేసిందని, అనంతరం ఈ హక్కులను సిక్కులు, బౌద్ధులకు విస్తరించినప్పటికీ క్రైస్తవులు, ముస్లింలను మాత్రం హక్కులకు దూరం చేసిందన్నారు. ఇది రాజ్యంగ స్ఫూర్తికి విరుద్దమన్నారు. ఆయా అంశాలను పరిగణంలోకి తీసుకొని ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.