మెండోరా, ఏప్రిల్30: మండలంలోని పోచంపాడ్, సోన్పేట్ గ్రామాల ప్రజలు సుమారు ఐదు దశాబ్దాల నుంచి పడుతున్న కష్టాలు దూరం కానున్నాయి. గతంలో కాకతీయ కాలువపై ఇరుకు వంతెనతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేడు సీఎం కేసీఆర్ సహకారం, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కృషితో నూతన వంతెన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో 1963 సంవత్సరంలో పోచంపాడ్, సోన్పేట్ గ్రామాల మధ్య కాకతీయ కాలువ నిర్మించారు. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు సాగించేందుకు 1970లో ఫుట్పాత్ బ్రిడ్జ్ (ఇరుకు వంతెన) నిర్మించారు. ఈ వంతెన మీదుగా నడుచుకుంటూగానీ, ద్విచక్ర వాహనాలపై గానీ వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉండేది. ఎక్కువగా సోన్పేట్ గ్రామం నుంచి రైతులు పోచంపాడ్కు పాలు, కూరగాయలు విక్రయించేందుకు, పాఠశాలలకు విద్యార్థులు, ఎస్సారెస్పీ ప్రాజెక్ట్పై, కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు, సిబ్బంది ఈ బ్రిడ్జిపై నుంచే వెళ్లేవారు. రెండు గ్రామాల మధ్య రోడ్డు సౌకర్యం లేకపోవడంంతో పొలాల మధ్య నుంచి పాదచారులు నడుచుకుంటూ వచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు గ్రామాల ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సుమారు ఐదేళ్ల క్రితం రూ.40 లక్షలతో బీటీ రోడ్డు వేయించారు. కాకతీయ కాలువపై నూతన బ్రిడ్జి నిర్మిస్తే తమ కష్టాలు దూరమవుతాయని గ్రామస్తులు మంత్రికి విన్నవించారు. మంత్రి స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి రూ.86 లక్షల నిధులు మంజూరు చేయించారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మూడు సార్లు టెండర్లు వేశారు. కాలువలో నిరంతరంగా నీరు ప్రవహిస్తుండడంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు.
కొత్త టెక్నాలజీతో బిడ్జి నిర్మాణం
కాకతీయ కాలువలో నీటి ప్రవాహం నిరతరంగా కొనసాగడంతో మంత్రి ప్రశాంత్రెడ్డి సీఎం కేసీఆర్కు పరిస్థితిని వివరించారు. సీఎం అనుమతితో అదనంగా మరో నిధులు మంజూరు చేయించారు. కాలువలో నీరు ప్రవహిస్తున్నప్పటికీ నూతన టెక్నాలజీతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా మంత్రి చర్యలు తీసుకున్నారు. రూ.కోటీ 38 లక్షలతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు ఏప్రిల్లో మంత్రి శంకుస్థాపన చేశారు.
వేగంగా వంతెన పనులు
600 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో కాకతీయ కాలువపై వంతెన నిర్మాణ పనులు చేపడుతున్నారు. వంతెన నిర్మాణ పనులు ఐదు రోజులుగా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎస్సారెస్పీ అధికారుల పర్యవేక్షణలో నూతన బ్రిడ్జి నిర్మిస్తునారు. బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో రెండు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రికి రుణపడి ఉంటాం
నూతన బ్రిడ్జి ఏర్పాటుతో పోచంపాడ్, సోన్పేట్ గ్రామాల ప్రజలకు ప్రయాణం సురక్షితం అవుతుంది. సుమారు 53 ఏండ్ల క్రితం చిన్న బ్రిడ్జి నిర్మించారు. ఇప్పటి వరకు అందరు నాయకులకు మా బాధను విన్నవించాం. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. మంత్రి ప్రశాంత్రెడ్డికి విషయం తెలపడంతో వెంటనే పెద్ద వంతెన నిర్మాణానికి నిధులు మంజురు చేయించారు. మంత్రికి రుణపడి ఉంటాం. -ఎస్కే కాదర్ పోచంపాడ్
ఇరుకు వంతెనతో ఇబ్బందులు పడ్డాం
రెండు గ్రామాల ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఈ చిన్న బిడ్జిపై నుంచి ప్రయాణం సాగించారు. వంతెన శిథిలావస్థకు చేరడంతోప్రమాదాలు జరుగుతామని మంత్రికి తెలపడంతో నూతన బ్రిడ్జికి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. పనులకు శంకుస్థాపన కూడా చేశారు. వంతెన పనులు పూర్తయితే రెండు గ్రామాల ప్రజలకు కష్టాలు దూరఅవుతాయి. సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డి కృతజ్ఞతలు.
– బాబు సోన్పేట్