ఖలీల్వాడి, జూలై 7 : భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవో నంబర్ 58, 59, 76, 118 కింద భూ క్రమబద్ధీకరణ, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ధరణిలో నూతన ఆప్షన్ తదితర అంశాలపై సూచనలు చేశారు. జీవో నంబర్ 59 కింద గతంలో వచ్చిన దరఖాస్తుల్లో రూ. 10 లక్షల కన్నా అధికంగా చెల్లించాల్సిన 1,458 దరఖాస్తుదారులు ఇప్పటివరకు చెల్లింపులు ప్రారంభించలేదని, వారికి నోటీసులు జారీ చేసి చెల్లించేలా చూడాలన్నారు. లక్షలోపు చెల్లించాల్సిన 3,689 దరఖాస్తుదారులకు సైతం నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.
జీవో నంబర్ 58 కింద గతంలో 20 వేల 668 మంది లబ్ధిదారులకు పట్టాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని, 561 పట్టాల పంపిణీ పెండింగ్లో ఉందని, రెండు రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లకు సూచించారు. భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ధరణి కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ధరణిలో కొత్తగా ఐదు మ్యుటేషన్లు అందుబాటులోకి తెచ్చామని, ధరణి సేవలను విస్తృతం చేయడంతోపాటు చిన్నచిన్న లోపాలను సవరించేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. మిస్సింగ్ సర్వేనంబర్లు, విస్తీర్ణ సవరణ దరఖాస్తుల్లో ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం, ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.