భువనేశ్వర్: ఒడిశాలో చాలా కాలం అధికారంలో ఉన్న బీజు జనతా దళ్ (బీజేడీ) ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి రెండు విచారణ కమిషన్ నివేదికలు మాయమైనట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆరోపించింది. (VK Pandian) ఈ నేపథ్యంలో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి వీకే పాండియన్కు ఒడిశా పోలీసులు బుధవారం సమన్లు జారీ చేశారు.
కాగా, సీఎంవో నుంచి రెండు కమిషన్ నివేదికల మాయంపై దర్యాప్తు కోసం జూలై 25న 11 గంటలకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ముందు పాండియన్ హాజరుకావాలని ఆ నోటీసులో ఆదేశించారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న ఆయన వద్ద లేదా ఆయన ఆధీనంలో ఉన్న పత్రాలు, రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా ఇతర సామాగ్రిని వెంట తీసుకురావాలని కూడా అందులో పేర్కొన్నారు. పలాస్పల్లిలోని పాండియన్ నివాసానికి ఈ సమన్లు పంపారు.