విద్యానగర్, సెప్టెంబర్ 25 : నవరాత్రి అనేది సంస్కృత పదం. నవ అం టే తొమ్మిది అనే అర్థం ఉంది. అమ్మవారి తొమ్మిది రూపాలను ఈ నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. తొమ్మిది రోజులపాటు రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దుర్గామాత విగ్రహాలను నిలిపేందుకు పోటీపడి మరి మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. విజయానికి గుర్తుగా జరుపుకొనే విజయదశమి (దసరా) వేడుకల్లో దేవీనవరాత్రి ఉత్సవాలే అత్యంత ప్రధానమైనది. చిన్నా పెద్దా తేడా లేకుండా తొమ్మి ది రోజులపాటు దాండియాతో పట్టణం మార్మోగనున్నది. జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
శరన్నవరాత్రుల విశిష్టత..
వసంత కాలంలోని శరద్ రుతువులో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. దేవీ అనగా త్రిమూర్తుల తేజం కలిగిన మహాశక్తి అని అర్థం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఇండ్లలోనే కాకుండా మండపాల్లో ప్రతిష్టించి రోజుకో అలంకరణలో పూజలు నిర్వహిస్తారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి తొమ్మిది రోజుల తర్వాత దసరా పండుగ పూర్తయిన తర్వాత విగ్రహాలను ఊరేగించి చెరువులో నిమజ్జనం చేస్తారు.
తొమ్మిది రోజుల ఉత్సవాల కథ..
పూర్వకాలంలో దేవతలు.. భండాసురుడనే రాక్షసుడి బారి నుంచి రక్షణ పొందడానికి ఆది పరాశక్తిగా పిలువబడే దుర్గామాతను ఆశ్రయంచడం తప్ప వేరే మార్గం లేదని భావించి ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు మహాయజ్ఞం నిర్వహించారు. ఇందులో భాగంగా తన శరీర భాగాలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయగా కోటి సూర్యకాంతులతో కూడిన జగన్మాత ప్రత్యక్షమైంది. దేవతల కోరిక మేరకు వారికి అభయమిచ్చి పాడ్యమి మొదలుకొని నవమి వరకు రోజుకో రాక్షసుడి చొప్పున వధించింది. అందుకే అప్పటి నుంచి అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంద మాత, కాత్యాయ ని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనే రూపాలతో తొమ్మిది రోజులపాటు అలంకరణ చేసి పూజలు నిర్వహిస్తారని పండితులు చెబుతారు.
కామారెడ్డి పట్టణంలో నవరాత్రి ఉత్సవాల వేదికలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలకు ఆయా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. 26న సోమవారం శ్రీ బాలా త్రిపుర సుందరి, 27న గాయత్రీ దేవి, 28న కాత్యాయినీ దేవి, 29న అన్నపూర్ణాదేవి, 30న లలితా త్రిపుర సుందరి, అక్టోబర్ 1న శ్రీ మహాలక్ష్మీదేవి, 2న సరస్వతీ దేవి, 3న దుర్గాదేవి, 4న మహిషాసురమర్ధిని, 5న శారదా రాజరాజేశ్వరీ దేవి రూపంలో దర్శనమిస్తారు. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్లా రోడ్లో ఉన్న త్రిశక్తి ఆలయం, ఎన్జీవోస్ కాలనీలోని త్రిపుర సుందరి, హౌసింగ్ బోర్డు కాలనీలోని శారదా దేవి ఆలయంలో నవరాత్రుల ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. అంతే కాకుండా రైల్వేస్టేషన్, శివాజీరోడ్, విద్యానగర్, జన్మభూమి రోడ్, లయన్స్ క్లబ్, హిందూ యూత్ ఆధ్వర్యంలో మండపాలు ముస్తాబయ్యాయి.
అమ్మవారిని భక్తితో కొలవాలి..
దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని భక్తితో కొలవాలి. అమ్మవారిని పూజించడంతో మనలో ఉన్న పాపాలు తొలగిపోయి పుణ్యాలు కలుగుతాయి. సకల సుఖ శాంతి కలుగుతుంది. అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తుంది. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న వారి కోరికలు తీరుతాయి.
– గంగవరం ఆంజనేయ శర్మ (వేద పండితులు)