సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయే ఎంపీ అర్వింద్.. లోక్సభలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలను సభలో కనీసం లేవనెత్తట్లేదు. చివరకు తాను బాండ్ పేపర్ మీద రాసిచ్చిన పసుపుబోర్డు హామీ కోసమైనా పోరాటం చేయట్లేదు. కేంద్రంలోని బీజేపీ సర్కారు.. రాష్ట్రంపై కత్తి గట్టినా స్పందించడం లేదు. ధాన్యం సేకరణలో అనేక కొర్రీలు పెట్టిన కేంద్రం.. రాష్ట్రం నుంచి బియ్యం సేకరణను నిలిపివేసింది. ఫలితంగా రైసుమిల్లుల్లోని వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం వానలకు తడిసి మొలకలు వస్తున్నాయి. కోట్లాది రూపాయల వడ్లు ముక్కిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంపై పోరాడాల్సిన అర్వింద్ కిమ్మనడం లేదు. పసుపుబోర్డు, ధాన్యం కొనుగోళ్ల వంటి ఎన్నో కీలక అంశాలపై పార్లమెంట్లో ప్రస్తావించట్లేదు. ప్రస్తుత సమావేశాల్లోనైనా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పసుపుబోర్డు, ధాన్యం కొనుగోళ్లపై లోక్సభలో పోరాడాలని ఇందూరు రైతులు హితవు పలుకుతున్నారు. లేకుంటే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారు.
నిజామాబాద్, జూలై 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా వెలుగొందుతున్నది. నిజామాబాద్లాంటి వ్యవసాయక జిల్లా ధాన్యాగారమై విరాజిల్లుతోంది. లక్షల టన్నుల కొద్దీ వడ్లు, బస్తాల నిండా బియ్యం. ఎటు చూసినా కిక్కిరిసిన వరి ధాన్యపు రాశులు. కనీవినీ ఎరుగని పంట ఉత్పత్తులు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సాధించిన వ్యవసాయ ప్రగతికి ఇంతకన్నా నిదర్శనం మరోటి లేదు. భారతీయ జనతా పార్టీ కొంతకాలంగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను బలిపీఠం ఎక్కిస్తున్నది. వడ్ల పేరిట చేస్తున్న యాగి అంతా ఇంతా కాదు. ఇందులో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పూటకో మాట మాట్లాడుతూ అమాయకులైన ప్రజలను మభ్య పెడుతున్నారు. ప్రజలకు లాభం జరిగేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లడడం లేదు. లోక్సభలో కనీసం సమస్యలను ప్రస్తావించరు. ఇచ్చిన హామీలను సభా వేదికగా అడగరు. రైతుల వద్దకు వచ్చి రెచ్చగొట్టుడు తప్ప నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యం. సోషల్ మీడియాలో నిత్యం ఏవేవో పోస్టులు పెట్టడం, నోటికొచ్చింది వీడియోల రూపంలో వదలడం తప్పా ఎంపీగా ప్రజలకు చేసిందేమిటని ఓటేసిన జనాలు అడుగుతున్నారు.
ఎంపీపై ప్రజల్లో అసంతృప్తి…
నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు భౌగోళికంగా వేర్వేరు అయినప్పటికీ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయదారులు ఎక్కువ. దశాబ్దాల కాలం నుంచి పసుపు బోర్డు హామీ మూలుగుతున్నది. ఈ అంశంపై గత సాధారణ ఎన్నికల్లో హామీ ఇచ్చిన అర్వింద్ ఇప్పటికీ మాట నిలబెట్టుకోవడం లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే రాజీనామా చేస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చినప్పటికీ ఇంత వరకు ఉలుకూ.. పలుకూ లేదు. ఏమైందని రైతులు అడ్డుకుంటే.. ప్రశ్నిస్తే.. నిలదీస్తే.. ఎదురుదాడి చేయడం మినహా సమాధానం ఇచ్చేంత ఓపిక కూడా అర్వింద్కు కరువైంది. మూడేండ్లలో వీసమెత్తు పని చేయని అర్వింద్ను రెండు జిల్లాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా అడ్డుకుంటున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ నిలదీస్తున్నప్పటికీ మార్పు అన్నది బీజేపీ ఎంపీలో కనిపించడం లేదు. ఎర్రజొన్న రైతులకు కనీస మద్దతు ధర హామీ అటకెక్కింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఊసు లేదు. ఒక్క ప్రాజెక్టు మంజూరు లేదు. యువతకు ఉపాధినిచ్చే మార్గంపై ఆలోచన సైతం చేయని ఎంపీపై స్థానికంగా యువతీ, యువకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సభకు హాజరయ్యేనా?
లోక్సభ, రాజ్యసభ సమావేశాల ఆరంభం నుంచి టీఆర్ఎస్ ఎంపీలు ధిక్కార స్వరం వినిపించేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణపై కేంద్రం అవలంబిస్తున్న కక్షపూరిత ధోరణిని ఎండగట్టేందుకు నడుం బిగించారు. తెలంగాణ రైతన్నల గోసను యావత్ దేశానికి తెలిసేలా గర్జించేందుకు రెడీ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ బీజేపీ ప్రభుత్వం తీరును బట్టబయలు చేయబోతున్నారు. రూ.వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని, మర ఆడించిన బియ్యాన్ని సైతం ఎఫ్సీఐ నిలిపేయడంతో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేందుకు ఎంపీలు నిరసన తెలిపేందుకు రెడీ అవుతుండగా బీజేపీ ఎంపీలు ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. ప్రతి సమావేశంలో మచ్చుకు లోక్సభలో కనిపించని అర్వింద్ ఈసారి సభలో ఉంటారా? సోషల్ మీడియాలోనే కనిపిస్తారా? అన్న ప్రశ్న నిజామాబాద్ వాసుల్లో ఉంది. ఓ వైపు రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్ర సర్కారు చేసిన ప్రయత్నాలను కొనియాడారు. కేంద్ర సర్కారు కావాలనే కుట్రపూరితంగా రాజకీయాలకు పాల్పడుతున్నదని పరోక్ష ఆరోపణలు సైతం చేసిన దరిమిలా ఎంపీ వైఖరి ఎలా ఉంటుందని రైస్మిల్లర్లు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కేంద్రం పట్టించుకోకపోతే పోరుబాటకు సిద్ధం కావాలని రైస్మిల్లర్లు యోచిస్తున్నట్లు తెలిసింది.
కాలక్షేపమే పరమావధి…
రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఓటేసిన ప్రజల మేలుకు లోక్సభ, రాజ్యసభ సభ్యులు పాటుపడుతుంటారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. లోక్సభ సభ్యుడిగా గురుతర బాధ్యతను విస్మరించి ఢిల్లీ వేదికగా రాజకీయ ప్రకటనలు చేయడంపై ప్రజలు మొదట్నుంచి నుంచి ఛీత్కారాలు పెడుతున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో సభలో ఉండాల్సిన ఎంపీ నిత్యం సోషల్ మీడియాలోనే తళుక్కుమంటుండడం ఏంటంటూ ఎద్దేవా చేస్తున్నరు. గతంలో ఏ ఎంపీ కూడా ఈ రకంగా సోషల్ మీడియా ప్రచారాలకు ఎగబడలేదని జనాలు గుసగుసలాడుతున్నారు. ఆయా ప్రజల అవసరాలను తెలుసుకొని కేంద్రంతో ఒప్పించి మెప్పించి పనులు చేయించేవారని అలాంటి సంస్కృతికి ఎంపీ అర్వింద్తో స్వస్తి పడ్డట్లు అయ్యిందని మండిపడుతున్నారు.
పసుపుబోర్డుపై ప్రశ్నించాలి
పార్లమెంట్ సమావేశాల్లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. పసుపుబోర్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ అర్వింద్ బోర్డు కోసం పార్లమెంట్లో గళమెత్తాలి. బోర్డు సాధన కోసం కృషి చేయకుంటే రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్తాం.
-బాల్రెడ్డి, రైతు, వేల్పూర్
రైతు సమస్యలను సభలో లేవనెత్తాలి
వేల్పూర్, జూలై 18 : రైతు సమస్యల పరిష్కారానికి ఎంపీ అర్వింద్ పార్లమెంట్లో మాట్లాడాలి. పంటలకు గిట్టుబాటు ధరలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గిట్టుబాటు ధరల కల్పనకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎంపీ అర్వింద్ పార్లమెంట్లో డిమాండ్ చేయాలి.
–పాలెపు బాలరాజు, మోతె