నిజామాబాద్ క్రైం, మార్చి 12: నిజామాబాద్ జిల్లాలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. ఆర్టీఏ, ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటిస్తూ.. అధికారులకు సహకరించాలని సంబంధిత అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా ప్రయోజనం లేకుండా పోతున్నది. కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల ఏరియాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సీపీ కేఆర్.నాగరాజు సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై ట్రాఫిక్ పోలీసులతోపాటు సివిల్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతూ ఈ చలాన్లు (ఫైన్) విధిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రధాన ఏరియాలతోపాటు ప్రధానకూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తూ ట్యాబ్లు, కెమెరాల ద్వారా ఈ-చలాన్లు విధిస్తున్నారు. సీట్ బెల్టు ధరించని ఫోర్వీలర్ డ్రైవర్లకు, హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనాలు నడుపుతున్న వారికి, త్రిపుల్ డ్రైవింగ్, రాంగ్రూట్లో వెళ్తున్న వారికి, వాహన ధ్రువపత్రాలు లేని వారికి, రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ సక్రమంగా లేని వారికి ఫైన్ను ఈ-చలాన్ ద్వారావిధిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వందలాది ఈ-చలాన్లు విధిస్తున్నారంటే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఏ మేరకు బ్రేక్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రతి రోజూ 400 వరకు ఈ-చలాన్లు..
ట్రాఫిక్ పోలీసులు స్పెషల్డ్రైవ్లో భాగంగా నిత్యం వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి మార్చి 10వ తేదీ వరకు రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులకు ప్రతిరోజూ సగటున 350 నుంచి 400 వరకు ఈ-చలాన్లు విధించారు. 70 రోజుల్లో సుమారు 25 వేల ఈ చలాన్లు విధించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో నుంచి తొమ్మిది వేల మంది వాహనదారులు మాత్రమే ఈ-చలాన్లు చెల్లించారు. మిగిలిన వారు సుమారు రూ.పది లక్షల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉన్నది. పెండింగ్ ఫైన్లు పెరిగిపోవడంతో వీరిని గుర్తించి చలాన్లను కట్టించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
ఫైన్ మొత్తం చెల్లించాకే వాహనాలు రిలీజ్..
వాహనదారులు రూల్స్ బ్రేక్ చేసిన ప్రతిసారీ పోలీసులు ఈ-చలాన్ విధిస్తున్నారు. పోలీసులు ఫైన్ విధించిన వెంటనే సదరు వాహన యజమానికి మెసేజ్ వస్తుంది. వారికి ఎక్కడ, ఎందుకు, ఎంత ఫైన్ విధించారో ఫొటోతో సహా తెలుసుకోవచ్చు. అయితే చాలా మంది వాహనదారులు ఫైన్ పడిన వెంటనే చెల్లించకుండా పెండింగ్లోనే ఉంచుతున్నారు. ఒక్కో వాహనంపై సుమారు 4 లేదా అంతకన్నా ఎక్కువ ఫైన్లు పెండింగ్లో ఉంటున్నాయి. ఇలాంటి వారు మళ్లీ పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే వారి వెహికిల్పై ఉన్న పెండింగ్ ఫైన్లు మొత్తం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం ఫైన్లు చెల్లించిన అనంతరం వాహనాన్ని రిలీజ్ చేస్తున్నారు. పెండింగ్ ఫైన్లను ఎప్పటికప్పడు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.