తెలంగాణపై కేంద్ర సర్కారు మరోమారు కక్షసాధింపు చర్యలకు దిగింది. మన అన్నదాతలపై అంతులేని వివక్షను ప్రదర్శించింది. శనగ, గోధుమ, ఆవాలు, బార్లీ, మసూర్, కుసుమ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచుతూ మోదీ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకున్నది. అయితే, రాష్ట్రంలో విరివిగా సాగయ్యే వరి, సోయా, మక్క, పసుపు వంటి ప్రధాన పంటలకు ‘మద్దతు’ ఇవ్వకుండా కావాలనే నిర్లక్ష్యం చేసింది. కేంద్రం ప్రదర్శిస్తున్న తీరుపై ఉమ్మడి జిల్లా రైతులు మండి పడుతున్నారు. తెలంగాణ నుంచి ఓట్లు, సీట్లు కావాలి కానీ, మద్దతు ధర ఇవ్వరా? అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలి నుంచీ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నది. సీఎం కేసీఆర్ పాలనలో దూసుకెళ్తున్న తెలంగాణకు అడుగడుగునా ఆటంకాలను సృష్టిస్తున్నది. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని మోదీ సర్కారు.. తాజాగా ప్రధాన పంటలకు మద్దతు ధర కల్పించడంలోనూ వివక్ష చూపి అన్నదాతల ఆగ్రహానికి గురవుతున్నది.
నిజామాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతుల ఉసురు తీస్తున్నది. ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ఇవ్వకుండా కష్టాల ఊబిలోకి నెడుతున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందునా తెలంగాణ ప్రాంత కర్షకులపై బీజేపీ సర్కారు చూపుతున్న వివక్ష అంతా ఇంతా కాదు. 2022-23 యాసంగి సీజన్కు గాను దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యలో పంటలు సాగవుతున్నాయి. వీటిలో అత్యధిక పంటలన్ని ఆహార ధాన్యాలే ఉన్నాయి. వీటికి కనీస మద్దతు ధరలను పెంచి రైతులను ఆదుకోవాల్సిన కేంద్రం.. తక్కువ విస్తీర్ణంలో సాగయ్యే ఆరు పంటలకే ధరలు పెంచి చేతులు దులుపుకొన్నది. తెలంగాణలో సాగవుతోన్న ప్రధాన పంటలకు కావాలనే మొండి చేయి చూపింది. శనగ పంట తప్పా మిగిలిన పంటలకు ఎమ్మెస్పీ ప్రకటించక పోవడంపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఓ వైపు దేశ వ్యాప్తం గా పప్పు దినుసుల సాగును పెంచాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటనలు చేస్తుండగా, శనగ పంటకు అరకొరగా మద్దతును ప్రకటించడంపై రైతులు మండిపడుతున్నారు. ఉత్తర భారతదేశంలో పండించే పంటలకే పెద్ద పీట వేశారు.. వరి, మక్కజొన్న, పసుపు వంటి పంటలకు మద్దతు ధర ఎందుకు పెంచలేదని కర్షకులు బీజేపీ సర్కారును నిలదీస్తున్నారు.
వరి, పసుపు, మక్కకు మద్దతేది?
సీఎం కేసీఆర్ చేయూతతో ఉమ్మడి జిల్లా రైతులు సాఫీగా వ్యవసాయం చేసుకుంటున్నారు. రైతుబంధు రూపంలో పెట్టుబడి ఖర్చు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందడంతోపాటుగా 24 గంటల పాటు ఉచిత కరెంట్, సాగునీరు అంది స్తూ కేసీఆర్ రైతులకు కొండంత అండగా నిలుస్తున్నారు. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సుమారు 11 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఇందులో 70 – 80 శాతం వరి పంటనే ఉండడం గమనార్హం. వరి తర్వాత మక్కజొన్న, సోయాబీన్, పత్తి, పసుపు పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నాయి. తాజాగా కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర పెంపులో ఆయా పంటల్లో ఒక్క దానికి కూడా స్థానం లభించలేదు. శనగ, గోధుమలు, ఆవాలు, బార్లీ, కుసు మ, మసూర్ పంటలకు కేంద్రం తాజాగా మద్దతు ధర పెంచింది. ఒక్క శనగ మినహా మిగతా పంట లు ఉమ్మడి జిల్లా సహా తెలంగాణలో ఎక్కువగా పండవు. తెలంగాణ ప్రాంతంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కారు.. మద్దతు ధర విషయంలోనూ వివక్ష చూపిందనేందుకు తాజా ఉదంతమే నిదర్శనం. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని కేంద్రం.. వివిధ రూపాల్లో తెలంగాణను ఇబ్బందులకు గురి చేస్తున్నది. భారత్ రాష్ట్ర సమితిగా మారబోతున్న టీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ ప్రాంత ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
రైతుకు ‘మద్దతు’నివ్వని మోదీ..
ఎనిమిదేళ్లుగా దేశాన్ని ఏలుతున్న మోదీ హయాం లో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. పూటకో నిర్ణయంతో అన్నదాతల ఉసురు తీస్తున్న కేం ద్రం.. తాజాగా కనీస మద్దతు ధరల పెంపు విషయంలోనూ శీతకన్ను ప్రదర్శించింది. నల్ల చట్టాలతో బీజేపీ సర్కారు తమ ఉద్దేశాలను బయట పెట్టుకుంది. రైతుల కోపాగ్నికి దిగి వచ్చి ఏకంగా ప్రధానే జాతికి క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు దొంగ చాటున కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలికేందుకు అనేక సవరణలతో వ్యవసాయ, విద్యుత్ చట్టాలను తెర మీదికి తెస్తున్నారు. ఓ వైపు రైతులంతా మోదీ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో బీజేపీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా సాగయ్యే పంటలకు మాత్రమే మద్దతు ధరను పెంచడం, దక్షిణ భారతదేశంలోని పంటలను పట్టించుకోక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఎరువులు, విత్తనాల ధరల పెంపుతో రైతులకు పెట్టుబడి తడిసి మోపెడవుతున్నది. మోదీ చేతకానితనంతో జరుగుతున్న ఈ నష్టాన్ని పూడ్చుకోవడం ఎలా? అని రైతులు కలత చెందుతున్నారు.
చేతకాని ఎంపీ..
రైతులను ఆదుకోవడంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూడా విఫలమయ్యారు. పసుపుబోర్డు ఏర్పాటు హామీతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన అర్వింద్.. మూడున్నరేండ్లుగా రైతులకు ముఖం చాటేశారు. పసుపు బోర్డు, ఎర్రజొన్న, పసుపు పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్న హామీని ఆయన ఇప్పటికీ నిలబెట్టుకోలేదు. కేంద్రం చూపుతున్న వివక్షపై బాధ్యత గల ఎంపీగా ప్రశ్నించాల్సిన అర్వింద్ స్పందించక పోవడంపై రైతులు మండి పడుతున్నారు. బీజేపీ ఎంపీగా ఉన్న వ్యక్తికి ఈ ప్రాంత రైతులపై మమకారం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. 2022-23 యాసంగికి కనీస మద్దతు ధర ప్రకటించిన ఆరు పంటల జాబితాలో వరి వంటి ప్రధాన పంట లేకపోవడంపై అర్వింద్ స్పందించాలని అన్నదాతలు కోరుతున్నారు. అబద్ధపు హామీలతో గెలుపొందిన అధర్మపురి అర్వింద్.. రైతుల మేలు కోసమైనా వరి, మక్కజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
సాగుకు కేసీఆర్ భరోసా..
రైతులపై కేంద్ర సర్కారు దయ చూపక పోయినా, సీఎం కేసీఆర్ మాత్రం అండగా నిలుస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోవద్దనే భావనతో ధాన్యం సేకరణ జరిపించారు. కొనుగోళ్లపై గతేడాది కేంద్రం పేచీలు పెట్టినా కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. గత యాసంగి సీజన్లో రూ.1600 కోట్లు వెచ్చించి ఉమ్మడి జిల్లాలో పండిన వరి పంటను మొత్తం కొనుగోలు చేయించారు. ప్రైవేటు వ్యాపారుల దోపిడీని నివారించేందుకు ఇతర పంటలను వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రాష్ట్ర సర్కారే సేకరిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 2021-22లో 10 శనగ కొనుగోలు కేంద్రాల ద్వారా 6083 మంది రైతుల నుంచి 83,275 క్వింటాళ్ల శనగలను కొనుగోలు చేసి రూ.43.55 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 2021-22లో ఆర్మూర్లో కంది కొనుగోలు కేంద్రం ద్వారా 587 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేసి రూ.37లక్షలు రైతుల ఖాతాలో జమ చేశారు. మక్కజొన్న వంటి పంటలకు స్థానికంగానే డిమాండ్ ఉండటంతో మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తున్నారు.
రైతులకు అన్యాయం చేస్తుంది..
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆది నుంచి రైతులకు అన్యా యం చేసే విధంగానే ఉన్నాయి. రైతు వ్యతిరేక విధానాలను అవలంబించాలని చూడడం, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్పడం.. ఈ విధం గా మొదటి నుంచి కూడా అన్నదాతలను ఆగం చేసేలా వ్యవహరిస్తున్నది. మన రాష్ట్ర రైతులను మరీ దారుణంగా చూస్తున్నది.
– రాజేశ్వర్, రైతు, పాలెం
తెలంగాణపై విషం చిమ్ముతున్నది..
కేంద్రప్రభుత్వం మొదటి నుంచి కూడా తెలంగాణపై విషం చిమ్ము తున్నది. ప్రస్తుతం పెంచిన మద్దతు ధరల జాబితాలో మన రాష్ట్రంలో ప్రధాన పంటలైన వరి, మక్కజొన్న, పసుపు లేకపోవడం విడ్డూరం. మన రాష్ట్రంలో పండే వరి, మక్కజొన్న, పసుపు పంటల మద్దతు ధరను పెంచాలి.
– కల్లెం అశోక్, రైతు, తిమ్మాపూర్
తెలంగాణ రైతాంగంపై చిన్నచూపు..
తెలంగాణ రైతాంగంపై కేంద్ర ప్రభు త్వం చిన్నచూపు చూస్తున్నది. ఇక్కడ పండించే పంటలకు కాకుండా వేరే పంటలకు మద్దతు ధరలు పెంచి మేమే మద్దతు ధరను పెంచామని చెప్పుకోవడం సరికాదు. కేంద్రం ప్రతి విషయంలోనూ తెలంగాణ రైతాంగాన్ని పట్టించుకోకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది.
– బద్దం సాయారెడ్డి, రైతు, తల్వేద
మద్దతుధర ప్రకటించాలి..
తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పసుపు, మక్కజొన్న, వరికి కేంద్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధరను పెంచాలి. పెరిగిన పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని మద్దతు ధర వెంటనే ప్రకటించాలి. ఇక్కడ పండించే పంటలకు కాకుండా కేంద్రం శనగ, గోధుమ, ఆవాలు తదితర పంటలకు మద్దతు ధర పెంచుతూ ప్రకటించడం తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినట్లే అవుతుంది.
– ప్రశాంత్, రైతు, చౌడమ్మ కొండూర్