గ్రామాల్లో జోరుగా పనులు
రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా 8వ స్థానం
64లక్షల పనిదినాలకు 34లక్షల పనిదినాలు పూర్తి
1,23,925 కుటుంబాలకు పని కల్పించిన యంత్రాంగం
జాబ్ కార్డులను సద్వినియోగం చేసుకుంటున్న కూలీలు
గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ఈ పథకం కామారెడ్డి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. యాసంగి అనంతరం పల్లెల్లో వ్యవసాయ పనులు అంతగా లేకపోవడంతో కూలీలు ఉపాధి హామీ పనుల వైపు పరుగులు తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,23,925 కుటుంబాలకు అధికార యంత్రాంగం పని కల్పించింది. 64లక్షల పనిదినాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 34లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలోనే 8వ స్థానంలో నిలిచింది.
కామారెడ్డి, జూన్ 26: పనిలేని ప్రతిఒక్కరికీ పనికల్పించా లనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఇది నిరుపేద కుటుంబాలకు వరంలా మారింది. ఈ పథకానికి సంబంధించిన పనులు కామారెడ్డి జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కూలీల వలసల నిరోధానికి ఉపాధి పనులు దోహదపడుతున్నాయి. వ్యవసాయానికి అను బంధంగా ఇందులో మార్పులు చేర్పులు చేయడం అన్న దాతకు కలిసి వస్తోంది. ఉపాధి పనుల కల్పనలో నాలుగేండ్లుగా రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమస్థానంలో నిలువగా, గతేడాది దిగజారింది. అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం మరోసారి ఉపాధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. దీంతో రాష్ట్రస్థాయిలో 8వ స్థానానికి చేరుకున్నది. త్వరలోనే ఉపాధి పనుల్లో పురోగతి సాధించేలా అధికారులు అడుగులు వేస్తున్నారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీఆర్డీవో సాయన్న ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పనులు వేగిరం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 64 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.
34 లక్షల 70వేల పనిదినాలు పూర్తి
కామారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పథకం అమలులో జాతీయస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గుర్తింపు ఉండేది. గతేడాది కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో దిగువకు పడిపోయింది. దీంతో పూర్వవైభవం కోసం ఉన్నతాధికారులు, డీఆర్డీవో, ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ చూపుతున్నారు. జిల్లా పరిధిలో 526 గ్రామ పంచాయతీల వారీగా పనులను గుర్తించిన యంత్రాంగం.. వేగవంతానికి చర్యలు చేపట్టింది. జాబ్కార్డు ఉన్న వారందరికీ పనులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా జూలైలో నిర్వహించనున్న హరితహారాన్ని చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలో 2022-23 సీజన్కు 64 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా ఇప్పటికే 34లక్షల 70వేల 339 పనిదినాలు కల్పించారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో జాబ్కార్డు కలిగిన కుటుంబాలు 2లక్షల 73వేల 136 ఉండగా, 5లక్షల 60వేల 806 మంది కూలీలు ఉన్నారు. 104 కుటుంబాలకు చెందిన 2,492 మంది కూలీలు వివిధ కారణాలతో ఉపాధి హామీ జాబితా నుంచి తొలగించుకున్నారు. 2022-23 సీజన్లో 607 కుటుంబాలు కొత్తగా నమోదు కాగా, 2,278 మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. లక్షా 70వేల 242 కుటుంబాల్లో 3లక్షల 31వేల 312 మంది కూలీలు పనుల కోసం నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 3లక్షల 47వేల 339 మందికి పని కల్పించగా 45 కోట్ల 46లక్షల రూపాయలు వేతనాల రూపంలో కూలీలకు చెల్లించారు. 24 కుటుంబాలు ఇప్పటివరకు 100 శాతం పనిదినాలు పూర్తి చేసుకున్నారు.
మాచారెడ్డి మండలం టాప్
చెరువులు, కుంటలు, చెక్డ్యాముల పూడికతీత, కట్ట, పంట కాలువల మరమ్మతులు, పొలాలకు పిల్లదారులు, నర్సరీల్లో మొక్కల పెంపకం, ఫాంపాండ్, బావుల్లో మట్టి నింపడం, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, పొలాల్లో కల్లాలు, పశువుల పాకల నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు… తదితర పనుల ద్వారా కూలీలు లబ్ధి పొందుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పనుల కల్పనలో మాచారెడ్డి మండలం మొదటిస్థానంలో ఉండగా, చివరి స్థానంలో నస్రుల్లాబాద్ ఉన్నది.
లక్ష్యం దిశగా..
ఉపాధి హామీ పనుల కల్పనలో లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏ మండలంలో తక్కువ కూలీలు వస్తున్నారనే విషయమై దృష్టి సారించింది. కూలీలకు పనులకు వచ్చేలా క్షేత్రస్థాయిలో సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధి పనుల్లో జిల్లాకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నారు.
జాబ్కార్డు ఉన్నవారికి పని కల్పిస్తాం..
జిల్లావ్యాప్తంగా జాబ్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. గతంలో ప్రథమస్థానంలో ఉండ గా, మళ్లీ అదే స్థానం సాధించేందుకు పనులను వేగవంతం చేస్తు న్నాం. జిల్లాలో ఇప్పటివరకు 34 లక్షల 70వేల పనిదినాలు పూర్తిచేసి రూ.45కోట్ల 46లక్షలు కూలీలకు చెల్లించాం. ఈ ఏడాది 64లక్షల పనిదినాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
– సాయన్న, డీఆర్డీవో, కామారెడ్డి