బీఆర్ఎస్ ప్రభుత్వమంటే బీసీల ప్రభుత్వం. కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. గతంలో పని చేసిన ప్రభుత్వాలు బీసీలు, కుల వృత్తులను తీవ్ర నిర్లక్ష్యం చేశాయి. ఎన్నికలప్పుడు వచ్చే పార్టీలను నిలదీయాలి. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ బీసీలకు ఏం చేసింది. కుల గణన చేయాలంటున్న రాహుల్గాంధీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండో సమాధానం చెప్పాలి. మేం పనిచేశాం.. అందుకే హక్కుగా ప్రజల వద్దకు వస్తున్నాం.. మరోసారి ఆశీర్వదించండి.
ఖలీల్వాడీ, అక్టోబర్ 10: కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొస్తున్న నేత సీఎం కేసీఆర్ అని, పని చేశాం.. హక్కుగా మీ వద్దకు వస్తున్నాం.. ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలను కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ గౌడ సంఘంలో గౌడకులస్తుల ఆత్మీయ సమ్మేళనం, వర్నిరోడ్డులో మంగళవారం నిర్వహించిన నాయీబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఎన్నికల నగారా మోగిన తర్వాత మొదటి సమావేశం గౌడ కులస్తులతో జరుపుకోవడం సంతోషకరమన్నారు.
గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను, కల్లు వ్యాపారాన్ని చిన్నచూపు చూశాయని తెలిపారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటైతే గౌడ కులస్తులకు అండగా ఉంటామని కేసీఆర్ చెప్పినట్లు గుర్తుచేశారు. అలాంటి కులవృత్తులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని, గీత కార్మికులకు ఏమైనా సమస్యలుంటే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం పాలసీగా తీసుకొని ఈత వనాలను పెంచుతున్నదని, మద్యం టెండర్లలో 15 శాతం గౌడ కులస్తులకు రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణేనన్నారు.
సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని, గత ప్రభుత్వాల కాలంలో నిజామాబాద్ నుంచి ఎంతో మంది పెద్దనాయకులు పనిచేశారు కానీ, జిల్లాకు ఒక్కటే బీసీ హాస్టల్ ఉండేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల మంది బీసీ బిడ్డలకు ఫీజురీయీంబర్స్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని, బీసీల ప్రభుత్వమని చెప్పారు. ఎన్నికలప్పుడు అనేక పార్టీలు వస్తాయని, ఇన్నేండ్లు హాస్టళ్ల సంఖ్య ఎందుకు పెంచలేదో వారిని నిలదీయాలన్నారు. డిసెంబర్ 3 తర్వాత మళ్లీ ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు.
కులవృత్తులను ప్రోత్సహిస్తూ విద్యకు ప్రాధాన్యం
రాష్ట్రంలోని సెలూన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జనార్దన్ గార్డెన్స్లో నాయీబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. నాయీబ్రాహ్మణులది విఠలేశ్వరునికే క్షవరం చేసిన చరిత్రఅని, అశ్వినీ దేవతల వారసులని పేర్కొన్నారు. నాయీబ్రాహ్మణులు లేకుంటే సమాజానికి ఎంత ఇబ్బంది ఉంటుందో సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. నాయీబ్రాహ్మణుల కులవృత్తిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 35వేల సెలూన్లకు సబ్సిడీ విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహిస్తూ మరోవైపు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు కులవృత్తులను నిర్లక్ష్యం చేశాయని, కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తులను ఆదరిస్తున్నదన్నారు. బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో మొట్టమొదట తీర్మానం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. 60ఏండ్లు దేశాన్ని ఏలినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ హయాంలో బీసీ గణన ఎందుకు చేపట్టలేదో రాహుల్గాంధీ సమాధానం చెప్పాలన్నారు. రెండుసార్లు ఆశీర్వదించి గెలిపించారని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీని, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
నీరా కేఫ్ల ఏర్పాటుకు కృషి చేస్తా..: ఎమ్మెల్యే బిగాల
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తుల వారికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారని, కల్లు గీత కార్మికులకు ఆసరా పింఛన్లు అందిస్తూ వారి కుటుంబ సభ్యుల్లో ధీమా కల్పిస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. గౌడ కులస్తుల ఆత్మగౌరవానికి ప్రతీకగా గౌడ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, గౌడ భవనానికి ఎమ్మెల్సీ కవిత రూ.50లక్షలు, తాను రూ.50 లక్షల నిధులు మంజూరు చేశామని గుర్తుచేశారు. వృత్తిని నమ్ముకున్న వారి ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం హైదరాబాద్లో నీరా కేఫ్లు ఏర్పాటు చేసిందని, నగరంలో కూడా నీరా కేఫ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. సొసైటీని రద్దు చేస్తే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పునరుద్ధరించినట్లు గుర్తుచేశారు. నాయీబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ సెలూన్ షాపులు నిర్వహించుకునే నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్నదని, అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. నాయీబ్రాహ్మణులకు బీసీ బంధు ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అం దించామన్నారు. వర్ని రోడ్డు నాయీ బ్రాహ్మ ణ సంఘానికి రూ.15లక్షలు, వినాయక్నగర్ నాయీబ్రాహ్మణ సంఘానికి రూ.10లక్షలు, పట్టణంలో మోడ్రన్ సెలూన్ల నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు.
లాటరీ ప్రక్రియ ద్వారా షాపులను ఎంపిక చేస్తామని, ఒకవైపు నిజామాబాద్ నగర అభివృద్ధి, మరోవైపు కులసంఘాల అభ్యున్నతికి కృషి చేశామని, నగరంలోని ప్రతి గల్లీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని, నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరడానికి మినీ ట్యాంక్బండ్ నిర్మించామన్నారు. తాము చేసిన అభివృద్ధి మీ ముంగిట ఉన్నదని, మరోసారి అవకాశమిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎల్లమ్మతల్లి దయతో తనను ఎమ్మెల్యేగా, కవితక్కను ఎంపీగా గెలిపించాలని, ప్రజలకు మరింత సేవ చేస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూకిరణ్, టీఎస్డబ్ల్యూడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఎ.అలీం, కార్పొరేటర్లు బోడిగం కోమల్, సాయివర్ధన్, బట్టు రాఘ వేందర్, ఉమారాణి, పట్నం విక్రమ్గౌడ్, మల్లేశ్ యాదవ్, గౌడ సంఘం నాయకులు సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్ గౌడ్, అంబటి శ్రీను, రమణాగౌడ్, నరేందర్గౌడ్, నాయకులు అంతరెడ్డి దేవి, భూమేశ్వర్, సీతారాం పాల్గొన్నారు.
అత్యధిక మెజారిటీతో బిగాలను గెలిపించాలి : వీజీగౌడ్
అర్బన్ ఎమ్మెల్యేగా బిగాల గణేశ్ గుప్తాను మరోసారి గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీజీగౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ గౌడ కులస్తులను గుర్తించి అనేక సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మద్యం షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కల్లుగీత వృత్తి కనుమరుగవుతున్నదని గ్రహించి, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత మొక్కలు నాటి కులవృత్తికి న్యాయం చేశారన్నారు. ఎమ్మెల్సీ కవిత గౌడ కులస్తులకు అనేక పథకాలను ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నీరుగారిన కులవృత్తులకు మళ్లీ జీవం పోశారన్నారు. నగర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.