ఒకప్పుడు బంగారు నగలు ధరించాలంటే బంగారమే… వెండి నగలు పెట్టుకోవాలంటే వెండే. ఒకే లోహానికి చెందిన ఆభరణాలను మాత్రమే ధరించడం ఫ్యాషన్ నియమంగా ఉండేది. కానీ, ఇప్పుడు అవన్నీ మారిపోతున్నాయి. ప్రపంచ ఫ్యాషన్ రంగంలో ‘మిక్స్ అండ్ మ్యాచ్ జ్యువెలరీ’ కొత్త ట్రెండ్గా నిలుస్తున్నది. అంటే బంగారం, వెండి, ముత్యాలు, రంగురంగుల రాళ్లు, ఆధునిక లోహాలతో చేసిన ఆభరణాలను ఒకేసారి సమతూకంలో ధరించడం.
ఇటీవల పారిస్, మిలాన్, న్యూయార్క్ ఫ్యాషన్ ప్రదర్శనల్లోనూ ఈ ధోరణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక చేతికి బంగారు గాజులు, మరోవైపు వెండి కడియం, మెడలో ముత్యాల దండతో పాటు సన్నని బంగారు గొలుసు… ఇలాంటి కలయికలు ఇప్పుడు ఆధునిక శైలికి కొత్త నిర్వచనంగా మారాయి. ఒకే రకమైన నగలు ధరించడం కంటే, వ్యక్తిగత అభిరుచిని ప్రతిబింబించే కలయికలకే రూపకర్తలు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ ట్రెండ్ వెనుక మరో ఆసక్తికరమైన ఆలోచన ఉంది. ఇంట్లో ఉన్న నగలను సందర్భానికి తగ్గట్టుగా కొత్తగా మలచుకోవడం. అమ్మమ్మ కాలం నాటి ముత్యాల హారాన్ని ఆధునిక గొలుసుతో జత చేయడం, వెండి చెవిపోగులకు బంగారు ఉంగరాలను కలపడం, సంప్రదాయ నగలను పాశ్చాత్య దుస్తులతో ధరించడం… ఇవన్నీ ఇప్పుడు ప్రపంచ ఫ్యాషన్లో భాగమయ్యాయి.
ముఖ్యంగా భారతీయ మహిళలకు ఈ ట్రెండ్ మరింత అనుకూలం. పెళ్లిళ్లు, పండుగలప్పుడే కాదు… సాధారణ చీర, కుర్తా, లినెన్ దుస్తులతో కూడా ఇలాంటి నగల కలయిక ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే ఫ్యాషనిస్టులు ఒక సూచన చేస్తున్నారు. అన్ని ఆభరణాలను ఒకేసారి ధరించకుండా, ఒకే ఆకర్షణీయమైన రకాన్ని కేంద్రంగా పెట్టుకుని మిగిలిన వాటిని సమతూకంగా ఎంచుకుంటే అందం మరింత పెరుగుతుంది.