దేశ రాజధాని నడిబొడ్డున తెలంగాణ ఆడబిడ్డ పోరుకు తెర లేపుతున్నది. దశాబ్దాలుగా మరుగున పడేసిన మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం గొంతెత్తుతున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఖండాంతరాలకు చేర్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో నేడు ఢిల్లీలో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం కొనసాగనున్నది. రిజర్వేషన్ల విషయంలో బీజేపీ మొదటి నుంచి మాట తప్పడమే కాకుండా బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో సగం సీట్లను (50శాతం) మహిళలకే కట్టబెట్టింది గులాబీ పార్టీయే. మహిళలకు పెద్దపీట వేసిందీ బీఆర్ఎస్ పార్టీయే. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఆగడాలను ఎత్తిచూపాలన్న ఉద్దేశంతోనే కవిత పోరుకు సిద్ధమయ్యారు. దీక్షను అడ్డుకునేందుకు కుట్రలు పన్నినా, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పినా వెరువకుండా ఆమె జంగ్ సైరన్ మోగించారు. దీక్షతో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు. దీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి మహిళా నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
నిజామాబాద్, మార్చి 09, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమరభేరీ మోగించారు. చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలు వేదికలపై గొంతెత్తిన ఆమె తాజాగా ఢిల్లీ వేదికగా ఆందోళనకు సిద్ధమయ్యారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 10వ తారీఖున భావ సారూప్య పార్టీలతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో ఆందోళన కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించనున్నారు. 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్ పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గానికి కవిత ప్రాతినిధ్యం వహించిన సందర్భాల్లోనూ మహిళా రిజర్వేషన్పై పోరాటం చేశారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నించారు. దేశంలో మహిళా రిజర్వేషన్ అమలు ఆవశ్యకతను చాటిచెప్పారు. పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపైనా ఆమె ప్రసంగించారు. 2019లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా విజయం సాధించిన అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లుపై పోరాటం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో నిరాహార దీక్షతో కేంద్రానికి మహిళల సత్తాను చాటేందుకు ముందుకు వచ్చారు.
ప్రజల గొంతుక..
ఉద్యమ కాలం నుంచి కల్వకుంట్ల కవిత అణగారిన వర్గాల గొంతుకై నిలిచారు. తెలంగాణ సమాజాన్ని చైతన్య పర్చడం కోసం తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి తనదైన పాత్రను పోషించారు. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక సారూప్యతను సమానంగా నడిపారు. తెలంగాణ ఆమూలాగ్రం పర్యటించి మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు. బతుకమ్మకు ప్రాణం పోసి తెలంగాణ ఉద్యమంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచారు. ఎన్నో పోరాటాల్లో పోలీసు కేసులను ఎదుర్కొన్నారు. కేసీఆర్ సారథ్యంలో జరిగిన ఉద్యమం ద్వారా సిద్ధించిన తెలంగాణలో 2014లో తొలిసారిగా మహిళా ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఏర్పాటు కోసం నాటి నుంచి కేంద్రంలోని అధికార పక్షాన్ని నిలదీయడం మొదలు పెట్టారు. తనతో పాటు వివిధ పార్టీలకు చెందిన మహిళా ఎంపీలను సైతం చేరదీసుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రెండోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మాత్రం మహిళా రిజర్వేషన్ అంశాన్ని అటకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నది. దేశంలోని మహిళా శక్తిని చిన్నచూపు చూస్తుండడంతో కవిత మరోసారి జంగ్ సైరన్ మోగించారు. అందులో భాగంగానే ఢిల్లీ వేదికగా నిరాహార దీక్షను చేపట్టి దేశ జనాభాలో సగం ఉన్న ఆడపడుచుల ఆకాంక్షను చాటిచెప్పబోతున్నారు.
ధర్నా దద్దరిల్లేలా…
33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద శుక్రవారం నిరాహార దీక్ష చేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా.. ఆమె ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు పాల్గొనేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలి వెళ్తున్నారు. భారత్ జాగృతి మహిళా కార్యకర్తలు సైతం దీక్షలో పాల్గొననున్నారు. నిరాహార దీక్షలో సంఘీభావంగా ఆయా ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ లీడర్లు సైతం రాజధానికి పయనం అవుతున్నట్లు సమాచారం. ఢిల్లీలో కవిత తలపెట్టిన నిరాహార దీక్షతో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తోన్న మహిళా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు.
కవిత నిరాహార దీక్షతో బీజేపీలో ఒకింత నైరాశ్యం మొదలైంది. అందులో భాగంగానే దీక్షను ఇబ్బందికి గురి చేసే లక్ష్యంతోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే ఈడీని అడ్డం పెట్టుకొని కవితకు నోటీసులు జారీచేసింది. ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసి భయబ్రాంతులకు గురిచేయడం దీని వెనుకున్న బీజేపీ లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ కేంద్రంపై సమరం చేయడానికి వెనుకడుగు వేయకుండా అదే అకుంఠిత దీక్ష, పట్టుదలతో నిరాహార దీక్షలో పాల్గొనేందుకు కవిత సిద్ధమవ్వడం గులాబీ శ్రేణుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపింది. తెలంగాణలో అధికారం చేపట్టిన అనంతరం సీఎం కేసీఆర్ మహిళాలోకానికి చేస్తున్న సేవ అంతా ఇంతా కాదు. స్థానిక సంస్థల్లో వారికోసం ఏకంగా 50శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది.
బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంఘీభావంగా ఢిల్లీకి వెళ్తున్నాం. 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత చేపట్టిన దీక్షలో పాల్గొంటాం. మా నాయకురాలు తలపెట్టిన దీక్షతో బీజేపీ జంకుతున్నది. అందుకే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఒక మహిళా నాయకురాలిని ఇబ్బందులు పెడుతూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి.
– విశాలిని రెడ్డి, బీఆర్ఎస్ నాయకురాలు
మోదీకి మహిళలే బుద్ధి చెబుతారు..
తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో మహిళలకు ఒరిగిందేమీ లేదు. దేశ జనాభాలో సగ భాగం ఉన్న మహిళామణుల చిరకాల కోరిక మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు. ఈ బిల్లును అమలు చేయని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ. మోదీకి మహిళలే సరైన బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు. తీరు మార్చుకోకపోతే అధోగతి తప్పదు.
– సుమనా రెడ్డి, జడ్పీటీసీ, ఇందల్వాయి
రిజర్వేషన్ బిల్లు అమలు చేయాల్సిందే..
చట్టసభల్లో మహిళలకు 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు డిమాండ్ ఇప్పటిది కాదు. బీజేపీకి పార్లమెంట్ ఇరు సభల్లోనూ భారీ మెజార్టీ ఉంది. మహిళలపై వారికి గౌరవం ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఇట్టే ఆమోదింపజేయొచ్చు. కానీ కావాలనే కుట్రపూరితంగా మోదీ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఉద్యమం చేస్తున్నందునే కవితను ఇబ్బంది పెడుతున్నారు. అందులో భాగంగానే దర్యాప్తు సంస్థల ఉరుకులు, పరుగులు కనిపిస్తున్నాయి.
– విజయలక్ష్మి, బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకురాలు