ఖలీల్వాడి, జూన్ 7 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పారదర్శక పాలన అందిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సమైక్యపాలనలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంతో బాధపడేవారని, ఒక బిడ్డగా తనకు తెలుసని చెప్పారు. కేసీఆర్కు తెలంగాణ రైతులపై ఉన్నది తల్లి ప్రేమ అని పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని న్యూఅంబేద్కర్భవన్లో బుధవారం ‘సాగునీటి దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమెతోపాటు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..ఎక్కడ నెగ్గాలో కాకుండా.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. సీఎం కేసీఆర్ కాదని, కాళేశ్వరం చంద్రశేఖర్రావు అని పేర్కొన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెక్డ్యాంలు, రిజర్వాయర్లు అని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం గురించి ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలన్నారు.
కాలువలు తవ్వి కోట్లు దోచుకున్న కాంగ్రెస్
కాలువలు తవ్వి వేల కోట్లు దోచుకున్న చరిత్ర కాంగ్రెస్దని విమర్శించారు. కాంగ్రెస్ హయాం లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి పనిచేశారని తెలిపారు. కానీ అప్పుడు వచ్చిన నిధులు.. ఇప్పుడు వచ్చిన నిధులెన్ని అనే విషయాలను ఆలోచించాలని సూచించారు. కేసీఆర్ హయాంలో జిల్లాలో నీటిపారుదల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలి
వేసవికాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నాయంటే దాని వెనుక సీఎం కేసీఆర్ శ్రమ ఎంతో ఉందన్నారు. కాళేశ్వరం నిర్మాణం అంటే అది భగీరథ ప్రయత్నమని, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో లక్షా 80 వేల ఎకరాలకు సాగునీరు తెచ్చుకుంటామన్నారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఇంజినీరింగ్లో ఉద్యోగాలు తక్కువగా ఉండేవని, తెలంగాణ వచ్చాక ఇంజినీర్ల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ఇరిగేషన్, ఇంజినీరింగ్ విభాగాలను పటిష్టం చేశామని, దీంతో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో 15 మీటర్ల వరకు భూగర్భజలాలు పెరిగాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎక్కువగా లబ్ధి పొందింది నిజామాబాద్ అని తెలిపారు. సమైక్య పాలకులు తెలంగాణ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులు, నీళ్లు, నిధుల కేటయింపులపై ఏనాడూ దృష్టి సారించలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో అప్పటి మంత్రి సుదర్శన్రెడ్డి కీలుబొమ్మగా ఉండేవారని, అంతకుమించి అధికారాలు ఉండేవి కావన్నారు. నగర మేయర్ నీతూ కిరణ్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మినీ ట్యాంక్బండ్ను సందర్శించిన కవిత
నగర శివారులోని ఒకటో డివిజన్ పరిధిలో ఉన్న కాలూర్ గ్రామ ఊర చెరువు వద్ద రూ.82 లక్షలతో నిర్మించిన మినీట్యాంక్ బండ్ను ఎమ్మెల్సీ కవిత బుధవారం సాయంత్రం సందర్శించారు. నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, డైరెక్టర్ ముస్కె సంతోష్, మాజీ కార్పొరేటర్ విశాలినీరెడ్డితో కలిసి ట్యాంక్బండ్ అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చెరువుకు ఆనుకొని ఉన్న శివాలయంలో పూజలు నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ ఆడపడుచులు ఆరాధ్య దైవంగా భావించే బతుకమ్మను ఎత్తుకున్నట్లు ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు. అన్ని హంగులతో నిర్మించిన మినీ ట్యాంక్బండ్ను ప్రతి ఒక్కరూ సందర్శించి ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరాలని సూచించారు. ప్రజలందరూ ఆరోగ్య వాతావరణంలో జీవించాలనే ముఖ్య ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టారని, చెరువుల వద్ద మినీ ట్యాంక్బండ్ల నిర్మాణానికి పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్సీ తెలిపారు.