గిరిజనుల ఆత్మగౌరవ సౌధం నిర్మాణ పనులు అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రాలో రూ.3కోట్లతో నిర్మించనున్న బంజారా భవన్కు రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం పౌరాదేవి పీఠాధిపతి బాబూసింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగ్భండార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు బహిరంగసభలో ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. అంతకు ముందు ఆర్యవైశ్య సంఘ భవనాన్ని ప్రారంభించారు.
-డిచ్పల్లి /ఖలీల్వాడి, అక్టోబర్ 1
డిచ్పల్లి /ఖలీల్వాడి, అక్టోబర్ 1: నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3కోట్లతో నిర్మించనున్న జిల్లా బంజారా భవన్కు గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పౌరాదేవి పీఠాధిపతి బాబూసింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో భోగ్భండార్ నిర్వహించారు. అంతకుముందు పాంగ్రాకు వచ్చిన ప్రజాప్రతినిధులకు గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. గిరిజనులతోపాటు నేతలూ డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.
అనంతరం సమీపంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో నేతలు, ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నుడా చైర్మన్ సంజీవ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ మోహన్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
సీఎం కేసీఆర్కు గిరిజనులంటే ఎంతో ఇష్టమని, తెలంగాణ వచ్చిన తర్వాతే గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలోని 10లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి రావడానికి గిరిపుత్రులే కారణమన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు గిరిజనుల రిజర్వేషన్ ఆరు శాతం ఉంటే.. స్వరాష్ట్రంలో తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు చేశామన్నారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు గుర్తుచేశారు. ప్రధానమంత్రి మోదీ రిజర్వేషన్ శాతం పెంచకపోవడంతో సీఎం కేసీఆర్ రిస్క్ తీసుకొని పది శాతం రిజర్వేషన్ అమలు చేసినట్లు చెప్పారు. దీంతో విద్యా, ఉద్యోగాల్లో లాభం చేకూరుతున్నదన్నారు. రిజర్వేషన్ పెంచినప్పటి నుంచి దాదాపు నాలుగు వేల మంది లబ్ధి పొందినట్లు తెలిపారు. ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. రైతుబీమా, రైతుబంధు, పోడు పట్టాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. 8వేల మంది గిరిజనులకు ఫీజు రీయింబర్స్మెంట్, మారుమూల తండాలను జీపీలుగా మార్చామన్నారు. 60ఏండ్లు పాలించిన వారు ఏమీ చేయలేదని, తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. తేడా ఉందో లేదో చెప్పాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కేసీఆర్ పాలనలో.. గిరిజనులకు స్వర్ణయుగం
సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులకు స్వర్ణయుగం వచ్చిందని, దేశంలో గిరిజనుల హక్కుల కోసం, వారి అభివృద్ధికి మనసు పెట్టి పనిచేసిన సీఎం కేసీఆర్ ఒక్కరేనని రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజన బిడ్డల నుంచి పుట్టిందే కల్యాణలక్ష్మి పథకమని చెప్పారు. బతుకమ్మను ప్రపంచ పటంలో చూపించిన, తెలంగాణ ఉద్యమ సమయంలో మహిళలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన ఇందూరు బిడ్డ..ఎమ్మెల్సీ కవిత అని కొనియాడారు. 3196 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని తెలిపారు. తండాల్లో నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిలో మంత్రిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. హైదరాబాద్లో బంజారా భవన్ నిర్మించిందే తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధికారమిస్తే బీజేపీ ప్రభుత్వం తండాకో సేవాలాల్ గుడి కట్టిస్తానంటున్నదని, దేశంలో 14కోట్ల గిరిజనులు ఉన్నారని, ప్రేమ ఉంటే పార్లమెంటు వద్ద బంజారా భవనం కట్టాలని చాలెంజ్ చేశారు. అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సేవాలాల్ గుడులు నిర్మించారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రూ.4వేల పింఛన్ ఇవ్వాలని హితవు పలికారు. బాజిరెడ్డి గోవర్ధన్ గిరిజన పుత్రుడని, మంచి చేసేవారిని గుర్తుపెట్టుకొని మరోసారి గెలిపించాలని కోరారు.
గిరజన తండాల రోడ్లకు రూ.90కోట్లు
గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. పోడు పట్టాల పంపిణీ, 10శాతం రిజర్వేషన్ అమలు, హైదరాబాద్లో బంజారా భవన్, తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. జిల్లా బంజారా భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2కోట్లు మంజూరు చేయగా, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.కోటి ఇచ్చినట్లు వెల్లడించారు. కర్ణాటక ప్రజలను మోసం చేసినట్లు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారని, స్థానికంగా ఉన్న ఎంపీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పొద్దున లేస్తే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసుకోవడం తప్ప, ప్రజలకు చేసింది శూన్యమన్నారు. రూరల్ నియోజకవర్గంలో అన్ని తండాలను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, గిరిజన తండాల రోడ్లకు రూ.90 కోట్లు మంజూరు చేశామన్నారు. పాకాలా రామచంద్రపల్లె గ్రామాల అభివృద్ధికి, బంజారా భవనం హాస్టల్ గదులకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరగా రూ.5కోట్లు మంజూరు చేశారు. రోడ్ల అభివృద్ధికి రెండు రోజుల్లో నిధులు మంజూరు చేయించి జీవో విడుదల చేస్తానని హామీనిచ్చారు.