శక్కర్నగర్/ ఎడపల్లి: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలు కాపీ కొట్టేందుకు చేస్తున్న య త్నాలు విఫలమవుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు మరమ్మతులు చేపట్టగా.. కేంద్రం అమృత్ సరోవర్ పేర చెరువులకు మరమ్మతులు చేయిస్తామని చెప్పి విఫలమైందని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎడపల్లిలోని బతుకమ్మ చెరువు వద్ద గురువారం ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమం నిర్వహించగా.. ఆమె విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల్లో కాపీ చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన బోధన్ మాజీ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఆయన హయాంలో కనీసం 30మందికి కూడా పింఛ న్లు ఇప్పించలేకపోయారని అన్నారు. నిజామాబాద్ చెందిన మహేశ్ కుమార్ అనే కాంగ్రెస్ నాయకుడు సంబురాలు ఎందుకని ఇటీవల ప్రశ్నించారని తెలిపారు. సదరు నాయకుడు ఇలాంటి కార్యక్రమాలకు హాజరైతే సంబురాలు ఎందుకో తెలుస్తుందని ఆమె సూచించారు.
చెరువులు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి..
చెరువులు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని, గ్రామాలు బాగుంటేనే.. కుటుంబాలు బాగుంటాయని, దీంతో గ్రామాలు, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 47వేల చెరువులకు రూ.5వేల కోట్లతో మరమ్మతులు చేయించి రైతులకు సాగునీటి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. 2014కు ముందు రూ. 600 కోట్ల ధాన్యం కొనుగోలు చేసేవారని, స్వరాష్ట్రంలో ప్రతిఏటా రూ.12వేల కోట్ల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పా రు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఆందోళన చెందవద్దని సూచించారు. ఎండాకాలంలోనూ చెరువులను నిండుకుండలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. చెరువుల్లో చేపపిల్లలను ఉచితంగా అందచేసి, రాష్ట్రంలో 4లక్షల మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించారని అన్నా రు. పదేండ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు రూ పొందించి అమలు చేశారన్నారు. సొంత స్థలం కలిగి ఇండ్లు నిర్మించుకునే వారికి త్వరలోనే ‘గృహలక్ష్మి’ పథకం ద్వారా రూ. 3లక్షలు మంజూరుచేస్తామన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ. 3లక్షలు అందజేస్తామని తెలిపారు. ఎడపల్లి మండలంలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. జానకంపేట్, ఎడపల్లి మండల కేంద్రాల్లో మున్నూరు కాపు సంఘాల నిర్మాణానికి రూ.20లక్షల చొప్పున మంజూరు చేస్తానన్నారు.
జిల్లాకు పట్టిన దరిద్రం అర్వింద్: ఎమ్మెల్యే షకీల్
గతంలో ఎంపీగా కవిత హయాంలో చేసిన అభివృద్ధి తప్ప నేడు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. ప్రస్తుత ఎంపీ అర్వింద్ జిల్లాకు దరిద్రంగా మారారని విమర్శించారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాట్లాడుతూ కేవలం మూడున్నర ఏండ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి ప్రపంచంలోనే చారిత్రక రిజర్వాయర్గా పేరు సాధించామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్పర్సన్ ఎం. రజితాయాదవ్, జాగృతి జిల్లా కన్వీనర్ అవంతిరావు, ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.