నిజామాబాద్, సెప్టెంబర్ 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ నగర సుందరీకరణకు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే నగరం కొత్త సొబగులు అద్దుకుంటున్నదని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు రెండు రోజుల క్రితమే నిజామాబాద్ నగరంలోని 60 డివిజన్లకు రూ.60కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
త్వరలోనే ఆయా డివిజన్లలో పెండింగ్ పనులతో పాటుగా కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నేతృత్వంలో పరిశీలన చేస్తారన్నారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుందరీకరణ పనుల నిమిత్తం సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద రూ.6కోట్లు నిధులను ఎమ్మెల్యేతో కలిసి సాధించినట్లు కవిత చెప్పారు. నిజామాబాద్లో 30 జంక్షన్లను అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటామన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రవేశంలో చారిత్రక డిచ్పల్లి రామాలయం మకర తోరణాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. వెల్కమ్ టు నిజామాబాద్ సైన్ బోర్డుతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్లుగా స్పష్టం చేశారు. ఇలాంటి స్వాగత తోరణాన్ని ఆర్మూర్ ప్రాంతంలోనూ జాతీయ రహదారి వెంట స్తూపం మాదిరిగా ఏర్పాటు చేయబోతున్నట్లు కవిత వివరించారు. యువతకు చెప్పినట్లుగానే నిజామాబాద్లో జాబ్ మేళాలను వరుసగా నిర్వహించి దాదాపు నాలుగైదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు.
సీఎం కేసీఆర్ తీసుకుకొచ్చిన అద్భుత పథకాలతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయని కవిత తెలిపారు. నిజామాబాద్లో 350 మత్స్య సహకార సంఘాలుంటే 22వేల మంది మత్స్యకారులు సభ్యత్వాన్ని కలిగి ఉన్నారని చెప్పారు. ఇందులో 135 సొసైటీల్లో 4వేల మంది మహిళలున్నారని తెలిపారు. వీరికి మోపెడ్, కోల్డ్ స్టోరేజ్ ఆటోలు, కియోస్కోలు, చేపల విక్రయానికి అనుగుణమైన గొడుగులు, వలలు అందించినట్లుగా వివరించారు. పోచంపాడ్ ఫిష్ బ్రీడింగ్ సెంటర్లో రూ.7కోట్లతో అభివృద్ధి జరుగుతున్నదన్నా రు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కులాల్లోని వారందరికీ నైపుణ్యాభివృద్ధిని సాధించేలా తోడ్పాటును అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
మత్స్యకారులకు అందరికీ ఉచితంగా చేప విత్తనాలు పంపిణీ జరుగుతున్నదని వివరించారు. ఎనిమిదేళ్లలో నిజామాబాద్ జిల్లాలో రూ.22కోట్లతో దాదాపుగా 25కోట్ల చేప పిల్లలను అందించామని కవిత చెప్పారు. తెలంగాణలో ప్రత్యేకంగా దొరికే ఎర్రమూతి రొయ్య పిల్లలను 6కోట్లకు పైగా జలాశయాల్లో వదిలినట్లు వివరించారు. వీటి వల్ల మత్స్య సంపద పెరిగిందని, వీటిపై సంపూర్ణంగా మత్స్యకారులకు హక్కులు కల్పించబడ్డాయన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి సైతం హక్కులు కల్పించామన్నారు. ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.