ఖలీల్వాడి/ డిచ్పల్లి, నవంబర్ 24 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం ఆమె జిల్లాకేంద్రంలోని పలు కాలనీల్లో అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్గుప్తాతో కలిసి రోడ్షోలో, డిచ్పల్లి మండలం యానంపల్లి, ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి, స్టేషన్ తండా, సిర్నాపల్లి గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో రకరకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, యువత వాటిని నమ్మవద్దని సూచించారు. దేశంలో అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని, అవసరమైతే గూగుల్లో కొట్టి చూసుకోవచ్చన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసి అందులో 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. నోటిఫికేషన్ ఇవ్వగానే కాంగ్రెస్వారు కోర్టులో కేసులు వేస్తున్నారని తెలిపారు. దీంతో మిగతా ఉద్యోగాలు పెండింగ్లో పడ్డాయని ఆ విషయం మీ అందరికీ తెలిసిందేనన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఏడేండ్లు కొట్లాడి ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే ఇవ్వాలని రాష్ట్రపతి ద్వారా మార్పులు చేయించి కేంద్రం నుంచి జీవో తెచ్చారని వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడుతున్నామని, దీంతో గూగుల్ లాంటి పెద్దపెద్ద కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ రకరకాల అబద్ధాలు చెబుతున్నదని, అలా చెప్పే ఆ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిందన్నారు. రాగానే మూడు నెలల్లోనే సీఎం సీటు కోసం వాళ్లలో వాళ్లే పంచాయితీ పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు చెప్పిన పనులు చేయలేదన్నారు. కరెంట్ 9 గంటలు ఇస్తామని, మూడు గంటలు కూడా ఇవ్వడంలేదన్నారు. అదే తెలంగాణలో అయితే 24 గంటలు కరెంట్, ఇంటికాడికే నీళ్లు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన రాష్ట్రంలో కరెంట్ రాకుండా పోతుందని, మరోసారి భయంకరమైన పరిస్థితి వస్తుందన్నారు. గ్రామాలకు వచ్చి వట్టి మాటలు చెప్పే వారిని నమ్ముతారా.. పదేండ్ల నుంచి చెప్పింది చేస్తున్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను నమ్ముతారా ఆలోచన చేయాలని సూచించారు.
పదేండ్ల క్రితం పాలనలో ఎట్లు న్నం. ఇప్పుడు ఎట్లున్నం. అని గుర్తు చేసుకోవాలని కోరుతున్నామన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే కటాఫ్ డేట్తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పింఛన్లు వస్తాయన్నారు. మూడు వేలతో ప్రారంభమైన యేడాదికి రూ. 500ల చొప్పున రూ. 5వేలకు పెంచుతామన్నారు. మొదట తెల్లరేషన్ కార్డులు ఇస్తామని, ఏ ఇంటికి పింఛన్లు రావడం లేదో చూసి ఆ ఇంటి ఆడబిడ్డకు రూ.3వేల పింఛన్ ఇస్తామని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్లాట్ ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షలు ఇస్తామని, ఈ పథకం నిరంతరంగా ఉంటుందన్నారు. కేసీఆర్ చెప్పినట్లు ఈ పదేండ్లలో పుష్కలంగా నీళ్లు, 24 గంటల కరెంట్తో పంటల సాగు పెరిగిందన్నారు. భూమి దొరకడం లేదని తెలిపారు. స్థలం లేని వారికి కూడా ప్రభుత్వమే భూమి కొని ఇండ్లు నిర్మించి ఇస్తుందని చెప్పారు. కారు గుర్తుకు ఓటు వేసి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని కోరారు.