Pakistani citizens | వినాయక్ నగర్, మే 5 : పహాల్ గాం లో హిందువుల పైన జరిగిన ఉగ్రవాదా చర్య తరువాత దేశ అంతర్గత శాంతి భద్రతలో భాగంగా పాకిస్థాన్ పౌరులు భారతదేశంను విడిచి పోవాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో పాకిస్థాన్ పౌరసత్వం ఉన్న వ్యక్తులను వెళ్లగొట్టాలని అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకి సోమవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో పాకిస్తాన్ పౌరసత్వం చెల్లుబాటు కాని వీసాలతో నివసించే వారిని గుర్తించి వారిని బహిష్కరించాలని సీపీకి సూచించారు. గతంలో నిజామాబాద్లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు పట్టుపడ్డ సందర్భాన్ని గుర్తు చేస్తూ అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేసి వారిని గుర్తించాలని అన్నారు. నగర అంతర్గత శాంతి భద్రతలకు విఘతాం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం పాలిత రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేయడం లేదని ఆరోపించారు.
దీని మూలాన ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లే అవుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘతాం కలుగకుండా ఈ దేశ పౌరులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేట్లర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.