మోర్తాడ్, జూలై 13: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లిలోని పంప్హౌస్ మోటర్లు ప్రారంభించి కాళేశ్వరం జలాలను వదర కాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.
ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు రేవంత్రెడ్డి రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని, లేకపోతే రైతులతో కలిసి దశల వారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్ పంప్హౌస్ వద్ద రైతులతో కలిసి వేముల సోమవారం వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నా రక్తం తీసుకోండి, రైతులకు మాత్రం నీళ్లివ్వండి అంటూ స్వయంగా రక్తదానం చేసి నిరసన తెలిపారు. అనంతరం బాల్కొండ రైతుల రక్తపు సీసాలు, వినతిపత్రాన్ని ఎస్సారెస్పీ అధికారులకు అందజేసి, సీఎం రేవంత్రెడ్డికి పంపించాలని కోరారు. ఈ సందర్భంగా వేముల విలేకరులతో మాట్లాడారు.
ఎస్సారెస్పీలో 15 టీఎంసీల నీరు ఉందని, మన జిల్లా రైతుల అత్యవసరాల కోసం వెంటనే 4 టీఎంసీలను విడుదల చేయాలని వేముల డిమాండ్ చేశారు. వరదకాలువకు, కాకతీయ కాలువకు, గోదావరి నదిలోకి 0.5 టీఎంసీల చొప్పున, మెంట్రాజ్పల్లి పంప్హౌస్(ప్యాకేజీ-21) ద్వారా కప్పలవాగు, పెద్దవాగులకు 0.5, గుత్ప-అలీసాగర్ ఎత్తిపోతలకు 0.5 టీఎంసీలు, చెరువులను నింపేందుకు 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్నారు.
ఇలా చేస్తే 15 రోజుల పాటు పంటలను కాపాడుకోవచ్చని, ఈలోపు కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా రివర్స్ పంపింగ్ చేపట్టి ఎస్సారెస్పీని నింపుకోవచ్చని సూచించారు. మెంట్రాజ్పల్లి పంప్హౌస్ను ప్రారంభిస్తే కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పారించవచ్చని, గుత్ప-అలీసాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల చెరువులు నిండడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్సారెస్పీలో 6 టీఎంసీలే ఉన్నప్పటికీ రైతుల అవసరాల దృష్ట్యా వరదకాలువకు, కాకతీయ కాలువకు నీటిని విడుదల చేశామని వేముల గుర్తుచేశారు. ఇప్పుడు 15 టీఎంసీల నీళ్లున్నప్పటికీ, ప్రభుత్వం రైతులకు ఎందుకు నీళ్లు ఇవ్వదని ప్రశ్నించారు.
ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం వద్దకు వెళ్లి రైతుల పక్షాన ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ నెల 15వ తేదీన జరగనున్న శివమ్ సమావేశంలో రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే వరదకాలువ, కాకతీయకాలువ, గోదావరి, కప్పలవాగు, పెద్దవాగు తదితర ప్రాంతాల్లో రైతులతో కలిసి దశల వారీగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.