బోధన్, ఏప్రిల్ 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని కొర్రీలు పెట్టినా రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్దసంఖ్యలో ఏర్పాటుచేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాను మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ ఏర్పాట్లలో భాగంగా అక్కడ కొన్ని రోజులు ఉన్నానని, అక్కడి ప్రజల బాధలు చూస్తుంటే తనకు ఏడుపు వచ్చిందన్నారు. అక్కడ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు లేవని, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని తెలిపారు.
రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ‘మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభుత్వమైనా రావాలి లేదా మరాఠ్వాడాను తెలంగాణలోనైనా కలపాలని’ అంటున్నారని చెప్పారు. బీజేపీ వాళ్లకు అభివృద్ధి, సంక్షేమం అంటే ఏమిటో తెలియదని, మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. బోధన్ నియోజకవర్గంలో 65 వేల కుటుంబాలకు రైతుబంధు ఇస్తున్నామని, గత ఆరేండ్లలో ప్రతి ఏటా రెండుసార్లు రైతుబంధు అందడంతో రైతులు ఎంతో ఉత్సాహంతో పంటలు పండించి సంతోషంగా ఉంటున్నారన్నారు. ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్ రైతులకు 24 గంటలపాటు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని అభినందించారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, డీసీసీబీ డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, గింజుపల్లి శరత్, ఎంపీపీ బుద్దె సావిత్రి, ఏఎంసీ వైస్ చైర్మన్ సాలూర షకీల్, బీఆర్ఎస్ నాయకులు రవీందర్ యాదవ్, పి.రవికిరణ్, బుద్దె రాజేశ్వర్, సంజీవ్కుమార్, నక్క లింగారెడ్డి, నర్సింగ్రావు, రైతుబంధు సమితి బోధన్ మండల కన్వీనర్ వెంకట్రెడ్డి, బోధన్ శివాలయం చైర్మన్ బీర్కూర్ బుజ్జి, బోధన్ మారుతీ మందిరం చైర్మన్ నాగన్పల్లి మధు, పార్టీ రైతు విభాగం నాయకులు నక్క లింగారెడ్డి, ఎమ్మార్పీస్ నాయకుడు ఎం.విద్యాసాగర్, కౌన్సిలర్లు బెంజర్ గంగారం, దూప్సింగ్ పాల్గొన్నారు.